కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వ కుంట్ల కవిత నిజామాబాద్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. వచ్చే ఎన్నికల్లోనూ నిజామాబాద్ నుంచి ఆమె పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలూ ఇప్పుడు ఏకమైనట్టుగా వ్యవహరిస్తున్నాయి. కేవలం కవితను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంగా పార్టీలు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్లు నిజామాబాద్ కేంద్రంగా అనేక సంచలనాలకు తెరదీస్తున్నాయి.
తెలంగాణ విమోచన సభను బీజేపీ ఈ నెల 17న నిజమాబాద్ వేదికగా నిర్వహించింది. దీనికి ఏకంగా హోం శాఖ మంత్రి రాజ్నాథ్ హాజరయ్యారు. తెలంగాణ విమోచన ప్రాధాన్యం వివరించారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్లో కీలకంగా ఉన్న డీఎస్ తనయుడికి పార్టీ తీర్థం ఇచ్చి.. కాషాయ కండువా కప్పేశారు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ సీటును ఈయనకు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు కూడా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇందిరమ్మ బాట పేరుతో జిల్లాలో జోరుగా ప్రచారం చేస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతోంది.
ఇటీవల డిచ్ పల్లిలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తల్లో జోష్ ను నింపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాతో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి ఇతర ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. మరి విపక్షాలు ఇంత చేస్తుంటే.. అధికార టీఆర్ ఎస్ ఊరుకుంటుందా? టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రైతు సమన్వయసమితుల ఏర్పాటు, భూరికార్డుల ప్రక్షాళన, గొర్రెల పంపిణీ, చీరల పంపిణీ తదితర కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళుతున్నారు. డిసెంబర్ వరకూ ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాన్ని వదలొద్దన్న కేసీఆర్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. సో.. మొత్తంగా కవిత ఏ మాత్రం ఆదమరిచినా.. కొంప కొల్లేరే అన్నట్టుగా ఉంది పరిస్థితి!!