అవును! ఏపీ సీఎం చంద్రబాబు జమానాలో వైసీపీ అధినేత జగన్కు గూఢచారులు ఉన్నారట! వీరు ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయాన్నీ పూసగుచ్చినట్టు ముందుగానే జగన్ అండ్కోకి అందించేస్తున్నారట. అంతేకాదు, ప్రభుత్వ ప్రణాళికలు, కొన్ని అతి రహస్య, అత్యంత రహస్య నిర్ణయాలను కూడా వీరు జగన్ పరివారానికి మోసేస్తున్నారట! ఈ క్రమంలోనే అనేక రహస్య జీవోలు, ముఖ్యంగా ఉద్యోగులను తొలగిస్తారని, వారికి పెరఫార్మెన్స్ ఆధారంగా ఇంటికి సాగనంపుతారని, పురోహితులకు జీతాలు తగ్గిస్తారని ఇటీవల జగన్ పత్రిక సాక్షిలో అనేక కథనాలు వెలువడ్డాయి. అదేవిధంగా నంద్యాల ఉప పోరుకు సంబంధించి టీడీపీ తీసుకున్న రహస్య అజెండా కూడా జగన్కు తెలిసిపోయిందట.
దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు కన్నా ముందే అవే ప్లాన్లలో కొన్నింటిని జగన్ కాపీ కొట్టి అమలు చేశాడని బాబుకు ఉప్పందింది. దీంతో విస్తుపోయిన చంద్రబాబు.. తన నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న రహస్య నిర్ణయాలు జగన్ కు ఎలా చేరిపోతున్నాయి? ఎవరు చేరవేస్తున్నారు? అనే కీలక అంశాలపై దృష్టి పెట్టారు. కొన్ని రహస్య జీవోలు, కొన్ని రహస్య స్టేట్ మెంట్లు ఫొటో క్లిప్పింగులతో సహా సాక్షిలో ప్రచురితం అవడాన్ని బాబు ఇంకా సీరియస్గా తీసుకున్నారు. దీంతో ఇంటిలిజెన్స్ను రంగంలోకి దింపి దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? జగన్కు అనుకూలంగా ఎవరు చక్రం తిప్పుతున్నారు? ప్రభుత్వ రహస్యాలను ఎవరు చేరవేస్తున్నారు?
వంటి కీలక అంశాలపై ఇంటిలిజెన్స్ను పురమాయించారట. ప్రస్తుతం ఇంటిలిజెన్స్ ఈ పనిమీదే ఉందని తెలిసింది. ఇక, ప్రాథమిక సమాచారం ప్రకారం.. జగన్కు అనుకూలంగా కొందరు ఉన్నతాధికారులు అంటే.. ఐఏఎస్లు, ఐపీఎస్లు ముఖ్యంగా వైఎస్ హయాంలో ప్రమోషన్లు పొందిన వారు, లబ్ధి పొందిన వారు, అదేవిధంగా జగన్ సామాజిక వర్గానికి చెందిన వారు ఇప్పుడు జగన్కి పరోక్షంగా సాయం చేస్తున్నారట. వీరిలో సీఎంవోలోని ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వారు కూడా ఉండడం గమనార్హం. అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగులు కూడా జగన్తో చేతులు కలుపుతున్నారని తెలుస్తోంది.
దీంతో చంద్రబాబు వీరందరిపై త్వరలోనే కొరడా ఝళిపించేందుకు రెడీ అవుతున్నారట. ప్రస్తుతం నంద్యాల ఉప పోరు మంచి కాక మీదున్న నేపథ్యంలో.. అది ముగియగానే ఇంటి ఎలుకల పనిపడతారని అమరావతిలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. గతంలో ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనూ అనేక మంది జగన్తోను, ఆయన పత్రికతోనూ అంటకాగారు. దీంతో కిరణ్ వెల్లడించడానికన్నా ముందే ప్రభుత్వ నిర్ణయాలు సాక్షిలో దర్శన మిచ్చేవి. దీంతో కిరణ్ అప్పట్లో సాక్షికి అస్సలు ఎంట్రీ ఇవ్వకుండా అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. విచిత్రం ఏంటంటే.. ఈ వార్త కూడా లీకై.. సాక్షిలోనే వచ్చింది. ఆ తర్వాత మిగిలిన పత్రికల్లో వచ్చింది. సో.. మరి ఇప్పుడు బాబు ఎలా కట్టడి చేస్తారో చూడాలి.