ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? ప్రశ్నిస్తానంటూ అరంగేట్రం చేసిన పవర్ స్టార్కి ప్రజలు ఎంత వరకు మద్దతు పలుకుతారు? ఎన్ని ఓట్లు.. ఎన్ని సీట్లు గెలుచుకుంటారు? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు సర్వసాధారణం. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటీవల ఓ దమ్మున్న పత్రిక ఇలాంటి విషయాలపైనే సర్వే చేసింది. అయితే, గుండుగుత్తుగా ఏపీ ప్రజలు చంద్రబాబుకే మద్దతిస్తున్నారని తీర్మానం చేసేసింది.
అంతేకాదు, పవర్ స్టార్ పార్టీకి అంత సీన్లేదని, అప్పట్లో పవన్ అన్న చిరుకు జరిగిన అనుభవమే పవన్కి కూడా ఎదురవుతుందని పేర్కొంది. మరి ఇలా పవన్ పార్టీపై పత్రిక ఆడిపోసుకున్న నేపథ్యంలో జనసేన అభిమానులు, కార్యకర్తలు ఊరుకుంటారా? వారు కూడా ప్రజల్లోకి వెళ్లారు. ప్రజల్లో పవన్కి ఉన్న మద్దతుపై సర్వే చేపట్టారు. దాని ప్రకారంగా పవన్ పార్టీకి ఎన్ని ఓట్లు.. ఎన్ని సీట్లు వస్తాయో లెక్కలు కట్టారు. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. పవన్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగితే.. ఎలాంటి రిజల్ట్ వస్తుందో జనసేన తేల్చేసింది.
ఇదే విషయంపై మాట్లాడిన జనసేన అధికార ప్రతినిధి కళ్యాణ్ దిలీప్ సుంకర.. జనసేన సర్వే లెక్కలు వివరించారు. రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లోనూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 57 నుంచి 62 స్థానాలు పక్కాగా తమ బుట్టలో పడతాయని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ సందర్భంగా ఆయన దమ్ముఛానెల్పై విమర్శలు గుప్పించారు. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జనసేన ఎల్లప్పుడూ ముందుంటుందని తేల్చి చెప్పారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.