తన రథయాత్రతో బీజేపీకి పూర్వవైభవం తీసుకొచ్చిన కురువృద్ధుడు, ఎంపీ ఎల్కే అద్వానికి.. ఇప్పుడు ఏ పదవి దక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా తనను ఎంపిక చేస్తారని ఆశలు పెట్టుకున్న ఆయనకు.. మోడీ రూపంలో ఊహించని షాక్ తగిలింది. అప్పటి నుంచి మోడీ-అద్వానీ మధ్య ఇంటర్నల్ వార్ కొనసాగుతూనే ఉంది.
ప్రస్తుతం ఆయన్ను రాష్ట్రపతిని చేసి సముచిత గౌరవం ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అద్వానీ కూడా మళ్లీ ఇదే ఆశతో ఉన్నారు. అయితే ఈసారి కూడా ఆయనకు నిరాశ తప్పేలా లేదు. అద్వానీకి మోడీ ఈ విషయంలోనూ వ్యూహాత్మకంగా ఎర్త్ పెడుతున్నారు.
ప్రణబ్ముఖర్జీ తర్వాత రాష్ట్రపతి ఎవరు అనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక బీజేపీ కురువృద్ధుడు ఎల్కె.ఆద్వానీ ఈ పదవిపై పెట్టుకున్న ఆశలకు ప్రధాని మోడీ గండి కొట్టబోతున్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ఆద్వానీకి చెక్ చెప్పేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నారన్న సందేహాలు కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రపతి పదవికి సంబంధించి ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి కాగా మరొకరు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. ఇదే జాబితాలో స్పీకర్ సుమిత్రా మహాజన్, ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది మర్ములు కూడా ఉన్నారు.
ఇక ఈ పదవి రేసులో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మోడీ కేబినెట్లో మంచి మంత్రిగా పేరు తెచ్చుకోవడమే ఇందుకు కారణం. ఆమెకు అన్ని పార్టీల వారిలోను, దేశవ్యాప్తంగాను మంచి క్రేజ్ ఉంది. ఆమె రాష్ట్రపతిని చేస్తే .. మహిళలపై ఆర్ఎస్ఎస్ వివక్ష చూపుతుందన్న అపవాదును తొలగించినట్ల వుతుందనేది వ్యూహం. ఆరోగ్య రీత్యా ఆమెకు తగినంత విశ్రాంతి ఇచ్చినట్టు అవుతుందని కూడా మోడీ భావిస్తున్నారట.
జూలైలో రాష్ట్రపతి పదవి ఖాళీ కానున్న నేపథ్యంలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య జరిగిన చర్చలో వీరి పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చాయట. ఒకప్పుడు మోడీకి విపరీతంగా మద్దతు పలికిన అద్వానీ పేరు పరిగణనలోకి రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాతే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అడ్వానీకి చెక్ చెప్పేందుకే వీరందరి పేర్లను మోడీ తెరమీదకి తెచ్చారని తెలుస్తోంది.