తమిళనాట రాజకీయ సింహాసనంపై కూర్చోవాలని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ తహతహలాడుతున్నారు! అప్పుడో ఎప్పుడో సీఎం అవుతారని అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు.. ప్రజలు కూడా భావించారు. కానీ అనూహ్యంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఆగమేఘాల మీద చేసి ఆశ్చర్యపరిచారు. సీఎం పీఠం ఎక్కేందుకు శశికళ ఎందుకు ఇంత తొందరపడుతున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరినీ తొలుస్తోంది! అయితే దీనికి మన్నార్ గుడి జ్యోతిషుల ప్రభావం అధికంగా ఉందని సమాచారం!
రాజకీయ నాయకులకు నమ్మకాలు ఎక్కువనే విషయం తెలిసిందే! ముఖ్యంగా జ్యోతిష్యాన్ని, జ్యోతిష్కులు చెప్పిన విషయాలను ఎక్కువగా ఆచరిస్తుంటారు! ఇలాంటి నమ్మకాలు శశికళకు పుష్కలంగా ఉన్నాయట. ఏళ్ల నుంచి వారు చెప్పినట్టే చేస్తున్నారని సమాచారం. శశికళకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మన్నార్గుడి సిద్ధాంతి గారు గతంలోనే చెప్పారట.
జయ అనారోగ్యం సమయంలోనూ మన్నార్గుడి జ్యోతిష్యుల సలహాలనే చిన్నమ్మ పాటించారట. అమ్మ మరణం తర్వాత ఆమె కొన్ని పూజలు చేశారట. వాటి ఫలితం వల్లే ఆమెకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని టాక్.
సీఎం ఛాన్స్ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాలని శశికళ భావించారు. కానీ మన్నార్ గుడి జ్యోతిష్యుల వల్లే ఆమె ఈ విషయంలో తొందర పడ్డారట. ఎందుకంటే ఫిబ్రవరిలో మంచి ముహూర్త బలం ఉందని చిన్నమ్మకు జ్యోతిషులు చెప్పారట. అంతేగాక ఈనెల దాటితే సీఎం పీఠం ఎక్కినా.. కష్టాలు పడాల్సి వస్తుందని సూచించారని టాక్. అందుకే ఈనెల 7న లేదా 9న ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ తేదీలే మంచివని వారు శశికళకు చెప్పారట. మొత్తానికి మన్నార్ గుడి సిద్ధాంతి గారి మాట వేదవాక్కుగా భావించారట. దీంతో ఆ దిశగా చిన్నమ్మ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రమాణ స్వీకారానికి ముందు కూడా శశికళ కొన్ని ప్రత్యేక పూజలు చేస్తారని తెలుస్తోంది. మరి ఇన్ని పూజలు చేసినా.. చినమ్మ జాతకాన్ని జ్యోతిష్కులు కూడా మార్చలేకపోయారు! అనుకున్నదొక్కటి అయిందొక్కటి అన్నట్లు మారింది ప్రస్తుతం చిన్నమ్మ పరిస్థితి.