జ‌య‌ల‌లిత హెల్త్ బులిటెన్ ఏం చెపుతోంది…

త‌మిళ‌నాడు సీఎం, అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు అమ్మ జ‌యరామ‌న్ జ‌య‌ల‌లిత‌.. ఆరోగ్యం ఇంకా విష‌మంగానే ఉన్న‌ట్టు చెన్నైలోని అపోలో వైద్యులు ప్ర‌క‌టించారు. రెండు నెల‌ల కిందట సెప్టెంబ‌రు 22న తీవ్ర జ్వ‌రం ఇన్‌ఫెక్ష‌న్‌తో ఆస్ప‌త్రిలో చేరిన ఆమె ఆరోగ్యంపై అప్ప‌ట్లోనే వ‌దంతులు వ‌చ్చాయి. అయితే, సంపూర్ణ ప్ర‌త్యేక వైద్యంతో ఆమె కోలుకున్న‌ట్టు వైద్యులు తెలిపారు. ఇటీవ‌లే ఆమె రెండు మూడు రోజుల్లోనే ఇంటికి(పోయెస్ గార్డెన్‌) వ‌చ్చేస్తార‌ని కూడా అన్నాడీఎంకే నేత‌లు ప్ర‌క‌టించారు.

ఇదే విష‌యాన్ని అపోలో వైద్యులు కూడా ప్ర‌క‌టించారు. అమ్మ ఆరోగ్యం బాగుంద‌ని, కోలుకున్నార‌ని, ఇంటికి వ‌చ్చేస్తార‌ని త్వ‌ర‌లోనే పాల‌నా ప‌గ్గాలు చేప‌డ‌తార‌ని అంద‌రూ భావించారు. ఈ వార్త తెలిసిన వెంట‌నే త‌మిళ‌నాడు వ్యాప్తంగా సంబ‌రాలు చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆదివారం సాయంత్రం ఆమెకు గుండె పోటు వ‌చ్చి మ‌రో సారి తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. అప్ప‌టి నుంచి త‌మిళ‌నాడులో క్ష‌ణ క్ష‌ణం యుగంగా మారింది! ఏ క్ష‌ణాన ఎలాంటి వార్త వినాల్సి వ‌స్తుందోన‌ని అన్నాడీఎంకే స‌హా అమ్మ అభిమానులు క‌న్నుల్లో నీళ్ల‌తో గుండెల‌విసేలా రోదిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఈ రోజు మ‌ధ్యాహ్నం అపోలో వైద్యులు అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్‌ను విడుద‌ల చేశారు. ఆమె ఆరోగ్యం ఏమాత్ర‌మూ న‌యం కాలేద‌ని, తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని, చెప్ప‌డ‌మే కాకుండా ఎప్పుడు ఆమె కోలుకుంటారో చెప్ప‌లేమ‌ని వెల్ల‌డించ‌డంతో త‌మిళ‌నాడు వ్యాప్తంగా తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది.

ఇక‌, జ‌య ఆరోగ్యం గురించి అపో విడుద‌ల చేసిన హెల్త్ బులెటిన్లో .. జయలలితకు యాంజియోగ్రామ్‌ విధానం ద్వారా చికిత్సనందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు ప్రకటించారు. జయలలిత త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేయాలని అపోలో వైద్యులు సూచించారు. దీంతో త‌మిళ‌నాడు వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త , ఉత్కంఠ భ‌విత వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఏదేమైనా జ‌య బ‌తికే సూచ‌న‌లు 50-50గానే ఉన్నాయ‌ని స‌మాచారం.