ఏపీ సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ఎన్ని విజయాలు సాధించారు? ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు? ఎన్ని ఎన్నికల హామీలను నెరవేర్చారు? ఎన్ని పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు? అని ఒక్కసారి ఆలోచిస్తే.. చాలా చాలా తక్కువగానే విజయాలు నమోదయ్యాయని చెప్పక తప్పదు! అదేవిధంగా ఎన్నికల హామీల్లో దాదాపు సగానికి సగం కూడా నెరవేర్చలేదనే అనిపిస్తోంది. ఇక, బాబు ప్రవేశ పెట్టిన పథకాల్లో దాదాపు ఇప్పటికీ కొన్ని ప్రజలకు చేరువ కాలేదు. ముఖ్యంగా చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనను పరిశీలిస్తే.. హిట్స్ తక్కువ.. ఫ్లాప్స్ ఎక్కువ అని అనడంతోపాటు అసలు తక్కువ.. హడావుడి ఎక్కువ తరహాలో ఉంది!
రైతు, డ్వాక్రా రుణ మాఫీ సహా బంగారంపై రుణాలను కూడా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదేవిధంగా నిరుద్యోగులకు నెలనెలా భృతి కల్పిస్తామని చెప్పారు. అయితే, ఈ హామీల్లో ఏ ఒక్కదానికి కూడా బాబు తన పాలనలో చోటు కల్పించలేదు. అదేవిధంగా భారీ ఎత్తున ఉద్యోగ కల్పన అంటూ బాబు చేసిన హడావుడి హడావుడిగానే ఉండిపోయింది. దీంతో ఆయా హామీల అమలు కోసం ఎదురు చూసిన జనాలు విసుగెత్తి పోయారు. అయితే, బాబు పాలనలో సంతృప్తిగా ఉన్నది మాత్రం వికలాంగులు, వృద్దులు, వితంతువులు అని చెప్పడంలో సందేహం లేదు.
ఎన్నికల హామీ మేరకు ఆయా వర్గాలకు చంద్రబాబు పింఛన్లను భారీ మొత్తంలో పెంచి ఇవ్వడం వల్ల వాళ్లకి-చంద్రబాబుకి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇక, అదేసమయంలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని బాబు ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇది పెద్ద ఎత్తున రాష్ట్రంలో దుమారాన్ని రేపింది. ఉద్యమాలకు శ్రీకారం చుట్టించింది. ఒకరకంగా చెప్పాలంటే. చంద్రబాబు కంటిపై కునుకులేకుండా చేసింది. ఇక, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బాబు మరీ బెండ్ అయిపోయినట్టు కనిపిస్తోంది. ఎన్నికల సమయం సహా ఏడాది కిందటి వరకు ప్రత్యేక హోదా కావాల్సిందేనని, దీనికిగాను తాను ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని బాబు ప్రకటించారు.
అయితే, ఏడాది కిందట ఈ విషయలోనూ ప్లేట్ ఫిరాయించారు. హోద ఏమన్నా సంజీవనా? అంటే ఎదురు ప్రశ్నించారు. హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంటూ.. పెద్ద ఎత్తున నినదించారు. ఈ పరిణామం రాష్ట్ర ప్రజలను తికమకలోకి నెట్టేసింది. ఇక, బీమవరంలోని ఆక్వాప్రాజెక్టు విషయంలోనూ రైతుల గోడు పట్టకుండానే సీఎం వ్యవహరిస్తున్నరనే అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు. అయితే, రాజధాని అమరావతి విషయంలో మాత్రమే బాబు దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ కూడా బాబును అపజయాలే వెంటాడుతున్నాయి.
ఎంతో గొప్పగా చేపట్టిన స్విస్ ఛాలెంజ్పై హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించేసరికి దాని నంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక, పట్టిసీమ, పోలవరం కుడికాల్వకు నీరు, సీమలో సాగుకు నీరు, రెయిన్ గన్స్, నీరు-చెట్టు, ఇంకుడు గుంతలు వంటివి బాబు చేపట్టిన ప్రాజెక్టుల్లో కీలకమైన అమలు సాధ్యమవుతున్న పనులు బాబుకు పేరు తెస్తున్నాయి. సో.. ఇలా బాబు రెండున్నరేళ్ల పాలన.. విజయాలు తక్కువ.. విఫలాలు ఎక్కువగానే సాగుతోంది.