నందమూరి హీరో కళ్యాణ్రామ్ ఏ ముహూర్తాన టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడో గాని అప్పటి నుంచి మనోడికి బ్యాడ్ టైం నడుస్తోంది. పది సంవత్సరాలుగా హిట్ లేని కళ్యాణ్రామ్ గతేడాది స్టార్టింగ్లో వచ్చిన పటాస్ సినిమాతో కాస్త కోలుకున్నాడు. పటాస్ కళ్యాణ్రామ్ కేరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో పాటు కళ్యాణ్రామ్ కేరీర్ను ట్రాక్ ఎక్కించింది.
పటాస్ సినిమా లాభాలతో కళ్యాణ్ డిస్ట్రిబ్యూటర్లకు చాలా కాలంగా ఉన్న బాకీలను కూడా పూర్తిగా తీర్చేశాడు. అయితే ఆ తర్వాత కళ్యాణ్ నిర్మాతగా రవితేజతో తీసిన కిక్ 2 ఘోరంగా డిజాస్టర్ అయ్యి కళ్యాణ్ను దాదాపు రూ.10 కోట్లకు పైగా ముంచింది. ఆ తర్వాత కళ్యాణ్ హీరోగా వచ్చిన షేర్ సినిమా సైతం డిజాస్టర్లకే పెద్ద డిజాస్టర్గా నిలిచింది.
ఇలా హీరోగాను, నిర్మాతగాను వరుస దెబ్బలు తింటోన్న కళ్యాణ్ను ఇప్పుడు పూరి జగన్నాథ్ మరిన్ని కష్టాల్లోకి నెట్టాడన్న టాక్ టాలీవుడ్లో జోరుగా వినిపిస్తోంది. పూరి – కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇజం సినిమా ప్లాప్ అయ్యింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 26 కోట్ల రూపాయలట. పూరి మీద డౌట్గానే ఉన్న కళ్యాణ్ ఇంత బడ్జెట్ పెట్టేందుకు సాహసం చేయలేదట.
అయితే పూరి సినిమా ఎలాగైనా హిట్ అవుతుందని చెప్పి బలవంతపెట్టడంతో కళ్యాణ్ పూరిని గుడ్డిగా నమ్మేసి రూ.26 కోట్లు పెట్టేశాడట. నిజానికి ఈ సినిమా విడుదల చేయడానికే కల్యాణ్రామ్ చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎన్టీఆర్ ముందుకు వచ్చిన జనతా గ్యారేజ్ బయ్యర్ల చేత ఈ సినిమాను కొనిపించాడు. తీరా సినిమా బొక్క బోర్లా పడింది. ఇజం దెబ్బకు కళ్యాణ్ రూ.10 కోట్ల వరకు మునిగినట్టు తెలుస్తోంది. బయ్యర్లకు కూడా నష్టాలే ఎదురయ్యాయి. తమకు జరిగిన ఈ నష్టాన్ని ఎన్టీఆర్ తర్వాత సినిమాతో పూడుస్తాడని బయ్యర్లు ఆశతో ఉన్నారు.