తమిళనాడులో అమ్మకు ఏదైనా జరగరానిది జరిగితే అమ్మ వారసుడు ఎవరు ? ఇప్పుడు ఇదే అంశంపై అక్కడ మీడియాలో ఎడతెగలేని చర్చలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకేను గత మూడున్నర దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా నడిపిస్తున్న పురుచ్చితలైవి, అమ్మ జయలలిత నడిపిస్తున్నాయి. అయితే వారం రోజులుగా అమ్మ ఆరోగ్యంపై రకరకాల ఊహానాలు వెలువడుతున్నాయి. అమ్మ కోలుకుంటే అంతా క్షేమం…లేనిపక్షంలో అమ్మ వారసుడు ఎవరు అన్నదే ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆన్సర్లేని ప్రశ్నగా మిగిలిపోయింది.
ఎంజీఆర్ మరణానంతరం జయలలిత 1989 లో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టారు.అప్పటి నుంచి ఆమె విజయవంతంగా పార్టీని నడిపిస్తున్నారు. అన్నాడీఎంకేలోని నాయకులతో పాటు మంత్రులు సైతం అమ్మ ముందు సాగిలబడి నమస్కరిస్తారంటే వాళ్లకు అమ్మ మీద ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవుతోంది. అయితే ఏడు పదుల వయస్సులో ఉన్న ఆమెను ఇప్పుడు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో అమ్మ తర్వాత అన్నాడీఎంకే పార్టీని నడిపించే వారసుల గురించిన ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ జాబితాలో ఇప్పటి వరకు అమ్మకు అత్యంత సన్నిహితులుగా పన్నీర్ సెల్వం, శశికళ పేర్ల ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వీరిద్దరి కంటే ఓ స్టార్ హీరో పేరే ఎక్కువగా చర్చకు రావడం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అన్నాడీఎంకే పార్టీ కి సంభందం లేని అసలు రాజకీయనాయకుడే కానీ ఓ వ్యక్తి పేరు జయ వారసుడంటూ వినిపిస్తోంది.
తెలుగువాడైనా తమిళనాట విశేష అభిమానులను సంపాదించుకున్న తల అజిత్..అమ్మకు వారసుడు అంటూ అక్కడ జోరుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ సినీ జనాల్లో అజిత్ ఫాలోయింగ్ మాములుగా లేదు. అజిత్ కు జయలలితలకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకానొక సందర్భం లో అజిత్ మాట్లాడుతూ జయలలిత తనకు అమ్మతో సమానం అంటూ వ్యాఖ్యానించాడు. ఇక జయ చాలాసార్లు మరో హీరో విజయ్కు యాంటీగా అజిత్కు అన్ని అండదండలు అందిస్తున్నారు.
ఇక అన్నాడీఎంకేను తన తర్వాత నడిపించే తన వారసుడు కూడా సినీ గ్లామర్ ఉన్నవాడే కావాలన్నది అమ్మ అభిమతంగా జయలలిత తన సన్నిహితులకు ఇప్పటికే చెప్పినట్టు సమాచారం. మరి అమ్మ మాటను బట్టి చూస్తే అన్నాడీఎంకే భవిష్యత్తు సారధి అజితేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.