ఆస్తుల్లో ఏపీ మంత్రులే టాప్

ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మంత్రులపై కేసులు, వారి ఆస్తులపై అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

మొత్తం 620 మంత్రుల్లో 609 మంది డేటాను ఏడీఆర్ విశ్లేషించింది. దీని ప్రకారం రాష్ట్రాల మంత్రుల్లో కోటీశ్వరుల్లో టీడీపీకి చెందిన మంత్రి పొంగూరు నారాయణ రూ. 496 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక మంత్రి శివకుమార్ 251 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా మంత్రుల ఆస్తుల సగటు రూ.8.59 కోట్లు కాగా, ఏపీ మంత్రుల ఆస్తి సగటు రూ. 45.49 కోట్లు. తర్వాతి స్థానంలో కర్ణాటక, అరుణాచల్ ఉన్నాయి. ఆస్తుల అత్యల్ప సగటున్న రాష్ట్రంగా త్రిపుర(రూ. 31.67 లక్షలు)గా నిలిచింది. 34 శాతం రాష్ట్రాల మంత్రులు (210 మంది)లపై క్రిమినల్ కేసులున్నాయి. 113 మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్ర కేసులున్నాయి.

ఈ జాబితాలో 18మంది మంత్రులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, బిహార్(11), తెలంగాణ(9), జార్ఖండ్ (9) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 609 మందిలో 51 మంది మహిళా మంత్రులుండగా.. వీరిలో అత్యధికం మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచే ఉన్నారు. అటు కేంద్ర మంత్రుల్లో 14 మందిపై క్రిమినల్ కేసులుండగా.. సగటు ఆస్తి రూ. 12.94 కోట్లుగా వెల్లడైంది.