టాలీవుడ్‌, బాలీవుడ్‌ని సుధీర్‌ చుట్టేస్తాడా?

మారుతి డైరెక్షన్‌లో వచ్చిన సుధీర్‌ బాబు సినిమా ‘ప్రేమ కథా చిత్రమ్‌’ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ‘భలే మంచి రోజు’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు సుధీర్‌ బాబు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అక్కడ ‘బాఘీ’ సినిమాలో విలన్‌గా నటించాడు. హీరోకి ధీటుగా ఈ సినిమాలో విలన్‌ పాత్రలో నటించి బాలీవుడ్‌ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు.

ఆ సినిమా తర్వాతి నుండి తెలుగులో కూడా సుధీర్‌ బాబుకి నెగిటివ్‌ రోల్స్‌ అవకాశాలు పలకరించాయి. కానీ కథా బలం లేక కొన్ని అవకాశాలు వదులుకున్నట్లు సమాచారం. కానీ బలమైన విలన్‌ పాత్ర వస్తే ఖచ్చితంగా తెలుగులోనూ విలన్‌ పాత్రకి న్యాయం చేయడానికి రెఢీగానే ఉన్నాడు సుధీర్‌బాబు. తాజాగా సుధీర్‌ ఒక కథని ఓకే చేశాడట. ప్రముఖ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పుల్లెల గోపీచంద్‌ జీవిత చరిత్రని సినిమాగా తెరకెక్కించాలనుకుంటున్నాడట సుధీర్‌బాబు. దీనికి సంబంధించి వివరాలను సుధీర్‌ బాబు త్వరలో వెల్లడించనున్నాడు.

ఈ సినిమాలో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా కనిపించనున్నాడు సుధీర్‌ బాబు. స్వతహాగా సుధీర్‌కి బ్యాడ్మింటన్‌ అంటే చాలా ఇష్టం. బాగా ఆడతాడు కూడా. అయితే ఈ సినిమా కోసం ఈ ఆటపై మరింత శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాడట సుధీర్‌ బాబు. ఈ సినిమాలో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటించే అవకాశాలున్నట్లు సమాచారం.