మహేష్బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాపై ఏకంగా రూ.120 కోట్ల పెట్టుబడి పెట్టిన బయ్యర్లకు రూ.50 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో దారుణంగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని ఏరియాల్లోను స్పైడర్ బయ్యర్లు 50-60 శాతానికి పైగా పెట్టుబడి నష్టపోవడం దాదాపు కన్ఫార్మ్ అయ్యింది. ఇంత అట్టర్ ప్లాప్ అయినా ఈ సినిమా మహేష్ కెరీర్లో ఓ అరుదైన రికార్డుకు కారణమవుతోంది.
స్పైడర్ సినిమాకు ముందు రిలీజ్ అయిన మహేష్ 22 సినిమాలు వరుసగా విజయవాడ అలంకార్ థియేటర్లో 50 రోజులు ఆడాయి. మహేష్ కెరీర్లో సూపర్ హిట్ సినిమాలే కాదు పరమ డిజాస్టర్ సినిమాలు కూడా ఆ థియేటర్లో 50 రోజులు ఆడడం విశేషం. ఇక ఇప్పుడు స్పైడర్ సినిమాను కూడా 50 రోజులు ఆడిస్తామని ఆ థియేటర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించేసింది.
స్పైడర్ కూడా 50 రోజులు ఆడితే ఒకే థియేటర్లో మహేష్ 23 సినిమాలు అర్ధశతదినోత్సవం కంప్లీట్ చేసుకున్న రికార్డును సాధించినట్లవుతుంది. ఈ అరుదైన ఘనత ఉన్న ఒకే ఒక్క టాలీవుడ్ హీరోగా మహేష్ నిలిచిపోనున్నాడు. ఇక స్పైడర్ ప్లాప్తో నిరాశలో ఉన్న మహేష్ తన నెక్ట్స్ సినిమా భరత్ అను నేను షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.