వెంక‌న్నను కూడా ప‌ట్టించుకోలేనంత బిజీనా బాబూ..!

వ‌రుస స‌మీక్ష‌లు, స‌మావేశాలు, రాజ‌కీయ వ్య‌వ‌హారాలు.. ఇలా నిత్యం త‌ల‌మున‌కలై ఉండే సీఎం చంద్ర‌బాబు.. తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి పాల‌నా వ్య‌వ‌హారాలు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. టీటీడీ చైర్మ‌న్‌గా ఎవరిని నియ‌మించాలో తెలియ‌క.. స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆయ‌న‌.. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీని కూడా నియ‌మించుకుండా మీన‌మేషాలు లెక్కిస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే టీటీడీకి సంబంధించి ఆయ‌న తీసుకున్న‌ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే! ఇదే స‌మ‌యంలో అథారిటీని కూడా నియ‌మించ‌కుండా కాల‌యాపన చేస్తుండ‌టం కూడా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

సాక్ష్యాత్తూ తిరుమల వెంకన్న స్వామిని కూడా పట్టించుకోలేనంత బిజీగా మారిపోయారు సీఎం చంద్ర‌బాబు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కాల పరిమితి ముగిసి నెలలు గడుస్తున్నాయి. కొత్త బోర్డు ఏర్పాటులో ఏదైనా కారణం వల్ల జాప్యం జరిగితే.. అప్పటి వరకు దేవస్థానంలో పరిపాలన సాఫీగా సాగేందుకు స్పెసిఫైడ్ ఆథారిటీని ఏర్పాటు చేస్తారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకూ దానిని నియ‌మించ‌లేదు. దీంతో దేవాదాయ శాఖ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ వంటి దేవస్థానానికి స్పెసిఫైడ్ ఆథారిటీ…లేదా బోర్డు లేకుండా ఇంత కాలం ఉంచటం గతంలో ఎప్పుడూ జరగలేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయ సమీకరణల కారణంగా బోర్డు కూర్పుపై నిర్ణయం తీసుకోవటంలో జాప్యం జరిగితే జరగొచ్చని.. అప్పటివరకూ కనీసం స్పెసిఫైడ్ ఆథారిటీ అయినా ఏర్పాటు చేయవచ్చు కదా? అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. టీటీడీ ఛైర్మన్ పదవి కోసం రాజకీయ నేతలు చాలా మంది రేసులో ఉన్నా.. ఎంపీలు.. ఎమ్మెల్యేలకు ఈ పదవి ఇచ్చేదిలేదని సీఎం స్ప‌ష్టంచేశారు. ఈ ప‌ద‌వి కోసం ఎంపీలు రాయ‌పాటి, ముర‌ళీమోహ‌న్ తీవ్రంగా ప‌ట్టుబట్టారు. అయితే చివ‌ర‌కు చంద్ర‌బాబు.. ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏ పదవి లేని వారికి మాత్రమే ఈ పోస్టు ఇస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ పదవికి బీద మస్తాన్ రావు పేరు పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇఫ్పటి వరకూ తెలుగువారినే టీటీడీ ఛైర్మన్ గా నియమించే సంప్రదాయానికి కూడా చంద్రబాబు గండికొట్టారు. నార్త్ కు చెందిన ఐఏఎస్ లకు ఈ పోస్టు ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేకపోయినా.. రాష్ట్ర చరిత్రలో ఇంత వరకూ తెలుగేతరులకు ఈ పదవి ఇఛ్చిన దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు తన అవసరాల కోసం దీన్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు స్పైసిఫైడ్ ఆథారిటీ.. బోర్డు ఏదీ లేకుండా టీటీడీని అలా వదిలేశారు. ఇక టీటీడీ ఈవో విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. మ‌రి ఇప్ప‌టికైనా వెంక‌న్న‌పై చంద్ర‌బాబు క‌రుణ చూపుతారో లేదో!!