టీ కాంగ్రెస్లో ఐదుగురు లీడర్లు…60 గ్రూపులు అన్న చందంగా పరిస్థితి ఉంది. ఒకరికి ఒకరికి అస్సలు పడడం లేదు. సీనియర్ నాయకులు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఈ టైంలో ఓ సర్వే ఇప్పుడు వీరి మధ్య పెద్ద చిచ్చు రేపింది. తాజాగా సర్వే ఫలితాలంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసింది. టీపీసీసీ ఆధ్వర్యంలో ఓ సర్వే చేశామని చెప్పిన కాంగ్రెస్ కు 55 స్థానాలు గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. అయితే ఓడిపోయే స్థానాలు కూడా ప్రకటించేశారు. ఇదే ఇప్పుడు రచ్చకు కారణమైంది.
కాంగ్రెస్లో బలమైన నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోతుందని ఉత్తమ్ ప్రకటన చేశారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో నాయకులు ఉత్తమ్పై మండిపడుతున్నారు. ఉత్తమ్ సర్వేలో నల్గొండ జిల్లాలోని నకిరేకల్, భువనగిరి సీట్లు కష్టమేనని ప్రకటించారు. దీంతో అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఈ రెండు నియోజకవర్గాల్లో ఉత్తమ్ సోదరుల హవా నడుస్తోంది. అయితే బయట వాస్తవ పరిస్థితి చూసుకున్నా ఉత్తమ్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన చాలా నియోజకవర్గాల కంటే ఈ రెండు చోట్ల కాంగ్రెస్ బలంగానే ఉంది. ఈ రెండు నియోజకవర్గాలే కాకుండా మిగతా జిల్లాల్లోనూ మాజీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఉత్తమ్ ప్రకటించారు.
దీంతో వారు కూడా ఉత్తమ్పై మండిపడుతున్నారు. ఉత్తమ్ ఏ ప్రాతిపదికన ఈ సర్వే చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సర్వే పార్టీ శ్రేణుల్లో ఉన్న జోష్తో పాటు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని వారు మండిపడుతున్నారు. ఇక జానారెడ్డి సైతం ఉత్తమ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. టైం కాని టైంలో ఈ సర్వే ఏంటని జానా ఫైర్ అవుతున్నారట. ఏదేమైనా టీ కాంగ్రెస్లో ఉత్తమ్ సర్వే చిచ్చు పెద్ద మంట పెట్టినట్టే ఉంది.