రాష్ట్ర విభజన ద్వారా ఏపీలో ఓడిపోయినా.. తెలంగాణలో అధికారంలోకి వస్తాని భావించిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాతి పరిణామాలతో ఖంగుతిన్నది. టీఆర్ ఎస్ అధికారంలోకి రావడం, ఆశించిన స్థాయిలో సీట్లను కైవసం చేసుకోకపోవడమే కాకుండా కాంగ్రెస్ నేతలు జంపింగ్లుగా మారరు. ఈ నేపథ్యంలో ఉన్న నేతలు సక్రమంగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టిన కాంగ్రెస్.. 2019 నాటికి పార్టీని ప్రక్షాళన చేయడం ద్వారా అధికారంలోకి రావాలని భావించింది.
ఈ క్రమంలో.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతల జాబితాను కాంగ్రెస్ అధ్యయనం చేస్తోంది. వీటి ఆధారంగా ఎవరిని తొలగించాలి? అనే విషయంపై స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. ప్రధానంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుల చిట్టాను వెలికి తీస్తున్నారు. ఎవరెవరు ఎంతెంత ఓట్ల తేడాతో ఓడిపోయారో… రెండో స్థానం కంటే కిందికి ఎంతమంది నేతలు నిలిచారో అనేది రికార్డులు తీస్తున్నట్టు సమాచారం! అంతేకాదు.. కటాఫ్ మార్కులు కూడా పెట్టారు! అంటే, పాతిక వేల ఓట్లు కంటే తక్కువ తేడాతో ఓడిపోయినవారు, అంతకంటే కాస్త ఎక్కువ తేడాతో ఓడినవారి జాబితా తయారు చేస్తున్నట్టు సమాచారం.
ఈ జాబితా ఆధారంగా సీనియర్లను సాగనంపొచ్చు అనేది వ్యూహంగా కనిపిస్తోంది. ఇలాంటి జాబితాలు తయారవుతున్నాయని తెలియడంతో కొందరు సీనియర్లు ఇప్పటికే పీసీసీ ముందు వాపోతున్నారట! వచ్చే ఎన్నికల్లో మరోసారి ఛాన్స్ ఇస్తే తమ సత్తా చాటుకుంటామని అంటున్నారట! అయితే, అధిష్టానం వ్యూహం మరోలా ఉంది. సీనియర్లలో అసంతృప్తి పెరగకుండా ఉండేందుకు వారికి కొన్ని హామీలు ఇచ్చేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. పార్టీ కోసం శ్రమించేవారిని అధిష్టానం అన్ని విధాలుగా గుర్తిస్తుందన్న భరోసా నింపే ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నారు.
ఈ విషయంగా సీనియర్లను కన్వెన్స్ చేసి… వచ్చే ఎన్నికల నాటికి దాదాపు 75 శాతం స్థానాల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలనేది కాంగ్రెస్ ఆలోచన. మరి, ఈ ఆలోచన ఆచరణ క్రమంలో సీనియర్ల రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.