సీనియర్ నటుడు శరత్ బాబు(71) సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. పలు అనారోగ్య సమస్యలతో పాటు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో హైదరాబాద్ లోకి ఓ ప్రైవేట్ హాస్పటల్ లో శరత్ బాబు తుదిశ్వాస విడిచారు. నేడు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా శరత్ బాబుకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి.
ఆముదాలవలసలో పుట్టి పెరిగిన శరత్ బాబు.. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలను పోషించి విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆరు భాషల్లో అవలీలగా మాట్లాడి మెప్పించిన ఘనుడు అయిన శరత్ బాబుకు సంతానం లేరు. మొదటి భార్య రమాప్రభతో కానీ రెండో భార్యతో కానీ పిల్లల్ని కనలేదు. ఇద్దరితో శరత్ బాబు విడిపోయారు.
అయితే పర్సనల్ లైఫ్ లో ఎప్పుడూ సంతోషంగా లేని శరత్ బాబు.. చివరి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నటుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న శరత్ బాబు.. ఇక సినిమాలు ఆపేసి హార్సిలీ హిల్స్ లో సెటిల్ అవ్వాలని ఆయన కోరుకున్నాడట. తన చివరి రోజులను అక్కడే ప్రశాంతంగా గడపాలని భావించారట. ఈ నేపథ్యంలోనే హార్సిలీ హిల్స్ లో ఇల్లు కూడా కట్టిస్తున్నాడట శరత్ బాబు. కాని ఇంకా ఇల్లు నిర్మాణం పూర్తి కాకుండానే శరత్ బాబు మృతి చెందారు. ఈ విషయం కుటుంబసభ్యులను, అభిమానులను ఎంతగానో కలవర పెడుతోంది.