సైబర్ నేరగాళ్ల మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేస్తున్నారు. సామాన్యులే కాదు సినీ తారలు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారు. తాజాగా ప్రముఖ నటి నగ్మా సైతం ఓ కేటుగాడి చేతులో దారుణంగా మోసపోయింది. ఒక్క క్లిక్ తో నగ్మా అకౌంట్ లో డబ్బంతా మాయం అయింది.
అసలేం జరిగిందంటే..ఫిబ్రవరి 28న నగ్మా ఫోన్ కి బ్యాంకు వాళ్ళు పంపినట్లు ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న లింక్ ని నగ్మా క్లిక్ చేశారట. వెంటనే ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంకు ఎంప్లాయ్ గా పరిచయం చేసుకున్న సదరు కేటుగాడు నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను.. కే వై సి కంప్లీట్ చేయమన్నాడట. నగ్మా ఎలాంటి బ్యాంకు డిటైల్స్ షేర్ చేయకుండానే.. కేటుగాడు తన ఆన్లైన్ బ్యాంకు అకౌంట్ లోకి లాగిన్ అయ్యాడట.
బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాదాపు లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడట. సదరు నేరగాడు లాగిన అయ్యే క్రమంలో నగ్మా ఫోన్కు దాదాపు ఇరవై ఓటీపీలు వచ్చాయట. ఫైనల్ గా ఒక్క క్లిక్ తో నగ్మా అకౌంట్ నుండి ఒక నేషనల్ బ్యాంకుకి రూ. 99,998 ట్రాన్స్ఫర్ అయ్యాయి. ప్రస్తుతం సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక నగ్మా కస్టమర్ గా ఉన్న సేమ్ బ్యాంకుకి చెందిన మరో ఎనభై మంది కస్టమర్స్ ఇదే తరహాలో మోసపోయారని తెలుస్తోంది.