హైదరాబాద్‌లో కూల్చి’వెతలు’

వానొచ్చింది, వరదొచ్చింది. హైదరాబాద్‌ నిండా మునిగింది. కనీ వినీ ఎరుగని స్థాయిలో అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలతో నగరం నిండా మునిగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం, కఠిన చర్యలకు దిగింది. నాళాల కబ్జా కారణంగానే హైదరాబాద్‌ మునిగిపోయిందని అంచనాకి వచ్చిన ముఖ్యమంత్రి కెసియార్‌, తక్షణం అక్రమ కట్టడాల్ని, నాళాల కబ్జాల్ని ‘చెరిపెయ్యండి’ అని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఇంకేముంది, నగరంలో ఎటు చూసినా కూల్చివేతలే కనిపిస్తున్నాయి. నిజానికి ఇది మంచి పనే. అక్రమ కట్టడాలకు తగిన శాస్తి జరగాలి. కానీ ఈ అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చినదెవరు? ఆ అధికారులపై తీసుకున్న చర్యలేమిటి? అన్నది కూడా ఆలోచించాలి.

 అధికారులపై చర్యలు ఆలస్యంగా, అభాగ్యులపై కూల్చివేతలు వేగంగా అంటే అది తప్పే అవుతుంది. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇళ్ళు నిర్మించుకున్నామంటూ బాధితులు వాపోతున్నారు. ఇంకొందరు తమ భవనాలకు సమీపంలో నాళాలు లేవని, ఇది కుట్రపూరితమని కన్నీరు మున్నీరవుతున్నారు. రాజకీయ అండదండలున్నవారేమో అధికారులతో వాగ్వాదానికి దిగుతూ ప్రజా ప్రతినిథుల్ని తెచ్చుకుని వాగ్యుద్ధానికి దిగుతుండడం శోచనీయం. ఏదేమైనప్పటికీ కూల్చివేతల విషయంలో శాస్త్రీయత పాటిస్తే బాగుండేది. ముందుగా నోటీసు ఇవ్వడం లేదా ప్రత్యామ్నాయ మార్గం చూపించి భవనాల్ని కూల్చివేయడం చేసి ఉంటే కెసియార్‌కి ఇంకా మంచి పేరు వచ్చేది.