ఆయన వైసీపీ ఎమ్మెల్యే.. ఓ రాజకీయ కుటుంబానికి చెందిన నేత.. టీడీపీ కీలక నేతపై వరుసగా రెండుసార్లు ఓటీ చేశారు. జగన్ వేవ్లో ఎట్టకేలకు 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు ఆయన సొంత పార్టీ కేడర్ నుంచే తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ కేడరే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని శపథాలు చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్. కిరణ్కుమార్ తండ్రి గొర్లె హరిబాబు కూడా సీనియర్ రాజకీయ నేతే. ఆయనకు వైఎస్సార్తో దోస్తీతో పాటు ఎంతో సానుకూలతలు ఉన్నా కూడా ఏ నాడు ఎమ్మెల్యే కాలేకపోయారు.
ఆ ఫ్యామిలీకి కాంగ్రెస్తో మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన రాజకీయ వారసుడిగా తెరమీదకు వచ్చిన కిరణ్ కుమార్ 2014 ఎన్నికలో ఎచ్చెర్ల నుంచి పోటీ చేసి కిమిడి కళా వెంకటరావు చేతిలో నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసలు 2019లో ఆయనకు మరోసారి టిక్కెట్ వస్తుందా ? రాదా ? అనుకుంటోన్న టైంలో జగన్ టిక్కెట్ ఇవ్వగా.. జగన్ గాలిలో 18 వేల ఓట్ల మెజార్టీతో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ నియోజకవర్గం పారిశ్రామిక వాడలకు నిలయం. ఎన్నో ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. అయితే కిరణ్కుమార్ నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ కేడర్ను కలుపుకుపోవడం పక్కన పెట్టేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. ఇతరత్రా పనుల్లో బిజీగా ఉన్నారట. పైగా సొంత పార్టీ కేడర్నే ఆయన ఇబ్బంది పెడుతున్నారట టాక్ వచ్చేసింది. దీంతో నియోజకవర్గంలో ఉన్న వైసీపీ అసమ్మతి వాదులు అంతా కలిసి వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామంటూ శపథాలు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో తాము ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడితే ఇప్పుడు ఎమ్మెల్యే తమనే రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారంటూ వాళ్లు మండిపడుతున్నారు. విచిత్రం ఏంటంటే ఈ నియోజకవర్గంలో టీడీపీలో కూడా విబేధాలు ఉన్నాయి. అయినా కూడా వైసీపీలోనూ ఇప్పుడు అదే తంతు కనిపిస్తోంది. ఈ గొడవలు సర్దుమణగకపోతే ఇక్కడ పార్టీ ఓడిపోవడం ఖాయం అని వైసీపీ వాళ్లే చెపుతున్నారు.