నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో జగన్ సర్కార్కు ఝలక్ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై దాఖలైన పిటిషన్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ బోర్డు పనులపై తనిఖీలు ఇప్పడే వద్దని ఏపి ప్రభుత్వం చేసిన అభ్యంతరాలను ఎన్జీటీ త్రోసి పుచ్చింది.
అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ప్రాంతాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించడం లేదని, కాబట్టి ఎన్జీటీనే స్వయంగా వచ్చి ప్రాజెక్టును పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
దీనిపై స్పందించిన ఎన్జీటీ.. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగా ప్రాజెక్టు పనులను పరిశీలించాలని కృష్ణా బోర్డుకు అదేశించింది. ఆ తర్వాత దానిపై స్పష్టమైన నివేదిక ఆగస్టు 9వ తేదీ లోపు ఇవ్వాలని ఎన్జీటి పేర్కొంది.