కన్నడ స్టార్ హీరో యశ్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన `కేజీఎఫ్` చిత్రం ఎన్ని సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సంగతి పక్కన పెడితే ఇటీవల ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు.. ట్విట్టర్ లో శ్రీనిధి ఫోటో షేర్ చేస్తూ ఓ సంచలన పోస్ట్ పెట్టాడు.
`కేజీఎఫ్ సెట్ లో యశ్ తో పని చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది. తను నన్ను వేధించాడు. తనతో కలిసి మళ్ళీ ఇంకో సినిమా చేయను` అంటూ శ్రీనిధి శెట్టి చెప్పుకొచ్చినట్లు ఉమైర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్త క్షణాల్లో వైరల్ అయ్యింది. కన్నడ సినీ పరిశ్రమలో ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపుతోంది. దీంతో శ్రీనిధి రియాక్ట్ అవుతూ.. గుట్టంతా రట్టు చేసింది.
`సోషల్ మీడియా వేదికను కొంతమంది దుర్వినియోగం చేయడానికి, చెడుని వ్యాప్తి చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. అసలు నేను మీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే.. కేజీఎఫ్ వంటి అద్భుతమైన సినిమా ద్వారా నాకు రాకింగ్ స్టార్ యశ్ తో కలిసి పని చేసే గౌరవం దక్కింది. అతను గొప్ప వ్యక్తి, స్నేహితుడు, గురువు మరియు ఒక ఇన్స్పిరేషన్. నేను ఎప్పటికి యశ్ అభిమానినే` అంటూ ఒక నోట్ రిలీజ్ చేసింది. ఉమైర్ ట్వీట్ లో ఎలాంటి నిజం లేదని పరోక్షంగా శ్రీనిధి క్లారిటీ ఇచ్చింది.