గోపాలపురంలో సీన్ రివర్స్..మళ్ళీ తమ్ముళ్ళ పోరు..!

ఇంచార్జ్‌ని మారిస్తే..గోపాలాపురంలో టి‌డి‌పి బలోపేతం అవుతుందని,అందరూ కలిసికట్టుగా పంచేసి పార్టీని గెలిపిస్తారని చంద్రబాబు భావించి…యువ నేత మద్దిరాజు వెంకట్రాజుకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని సైడ్ చేశారు. ఓడిపోయిన తర్వాత ముప్పిడి దూకుడుగా పనిచేస్తే, ఆయన పదవి పోయే పరిస్తితి వచ్చేది కాదు. ఆయన అనుకున్నంత యాక్టివ్ గా పనిచేయకపోవడం, అందరినీ కలుపుకుని వెళ్లలేకపోవడం వల్ల ముప్పిడి ఇంచార్జ్ పదవి పోయింది.

ఇక ఎలాగో యువ నేతలకు సీట్లు ఎక్కువ ఇస్తామని బాబు అన్నారు..అందులో భాగంగా మద్దిరాజుకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. సరే మద్దిరాజు దూకుడుగానే పనిచేస్తున్నారు. వైసీపీపై పోరాటం చేస్తున్నారు..అంతా బాగానే ఉంది గాని..మళ్ళీ మద్దిరాజు కూడా ఓ మిస్టేక్ చేస్తున్నారు..నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదనే విమర్శ ఉంది. ముఖ్యంగా ముప్పిడి వర్గాన్ని కలుపుకుని వెళ్ళడం లేదు. దీంతో గోపాలపురంలో మళ్ళీ వర్గ పోరు పెరిగింది.

ఇక మద్దిరాజుకు వ్యతిరేకంగా ముళ్ళపూడి బాపిరాజు ఉన్నారు..ఈయన వచ్చి ముప్పిడికి సపోర్ట్ గా ఉన్నారు. ఇలా నియోజకవర్గంలో కొందరు ఏమో మద్దిరాజుకు, మరికొందరు ముప్పిడికి మద్ధతు ఇస్తున్నారు. అంటే ఎవరికి వారు గ్రూపు రాజకీయం చేస్తున్నారు. అలా కాకుండా పనిచేస్తే గోపాలాపురంలో టి‌డి‌పి సత్తా చాటగలదు.

నియోజకవర్గంలో ద్వారకా తిరుమల, నల్లజెర్ల మండలాల్లో కమ్మ వర్గం కాస్త ఎక్కువగానే ఉంటుంది..వారి మద్ధతు ఎవరికి ఏంటి అనేది క్లారిటీ ఉండటంలేదు. అయినా ఇంచార్జ్ గా ఉన్న మద్దిరాజు అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత ఉంది. అలా వెళ్లకపోతే గోపాలాపురంలో టి‌డి‌పికి మంచి రోజులు రావు. అంతా కలిసి కట్టుగా పనిచేస్తే…ఒక దేవరపల్లి మండలం తప్ప మిగిలిన ద్వారకా తిరుమల, నల్లజెర్ల, గోపాలాపురం మండలాల్లో టి‌డి‌పి ఆధిక్యం సాధించగలదు. కాబట్టి అంతా కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేస్తే..చివరికి సీటు ఎవరికి ఇవ్వాలనేది బాబు చూసుకుంటారు .