రెండు దశాబ్దాల క్రితం మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే. అప్పట్లో సోనాలి అంటే బాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్. ఆమెకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మురారి సినిమాలో మహేష్ బాబు పక్కన సోనాలి అయితేనే బ్యూటిఫుల్ గా సెట్ అవుతుందని భావించిన దర్శకుడు కృష్ణవంశీ ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. మురారి సినిమాలో మహేష్ – బాబు సోనాలి బింద్రే జంటకు మంచి మార్కులు వచ్చాయి. వాస్తవానికి ఆ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత సూపర్ హిట్ అవడానికి సోనాలి బింద్రే కూడా ఒక కారణం.
ఆ సినిమా హిట్ కావడంతో ఆ తర్వాత ఆమె తెలుగులో వరుసగా కొన్ని ఆఫర్లు దక్కించుకుంది. మురారి తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో ఖడ్గం సినిమాలో నటించింది. ఆ తర్వాత నాగార్జున మన్మధుడు సినిమాలో నటించి ప్రేక్షకులను మైమరపించి చేసింది. మన్మధుడు సినిమా ఆమెకు తెలుగులో మంచి ఇమేజ్ తీసుకువచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ ఇంద్ర సినిమాతో పాటు బాలకృష్ణ పలనాటి బ్రహ్మనాయుడు – మరోసారి చిరంజీవి సరసన శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
ఆ తర్వాత సోనాలి తెలుగు సినిమాలలో కనిపించలేదు. 2013లో సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆమె టీవీ రంగంలోకి వెళ్ళింది. తన ప్రేమికుడు గోల్డీబెహాల్ను ప్రేమ వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో మూడేళ్ల క్రితం ఆమె క్యాన్సర్ భారిన పడింది. న్యూయార్క్లో ట్రీట్మెంట్ అనంతరం కోలుకున్న ఆమె తన జుట్టు కూడా కోల్పోయింది. ఆమె క్యాన్సర్ మహమ్మారిపై ఎంతలా పోరాటం చేస్తుందో ఎప్పటికప్పుడు ప్రపంచానికి చెపుతూనే ఉంది.
ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందని కూడా ఎవ్వరూ అనుకోలేదు. అయితే ఇప్పుడు ఆమె గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 19 ఏళ్ల తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించేందుకు రంగం సిద్ధం అవుతోంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ .. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సోనాలికి ఓ కీలక పాత్రను ఆఫర్ చేశాడట దర్శకుడు కొరటాల.
సోనాలీ ఎన్టీఆర్కు అత్త పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. గతంలో రమ్యకృష్ణ నా అల్లుడు సినిమాలో ఎన్టీఆర్కు అత్తగా నటించింది. ఆ తర్వాత అల్లరి అల్లుడు సినిమాలో మరో సీనియర్ భామ నగ్మా కూడా అత్త పాత్ర చేసింది. ఇప్పుడు కూడా అలాంటి మాస్ అల్లుడిగా ఎన్టీఆర్ కనిపిస్తాడా ? లేదా కొరటాల మార్క్ ఎమోషనల్, మెసేజ్ నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందా ? అన్నది అయితే క్లారిటీ రావాలి.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ హీరోయిన్. పాన్ ఇండియా సినిమా కావడంతో కొరటాల కాస్టింగ్ విషయంలో ఎక్కడా రాజీపడడం లేదు. ఆలియాతో పాటు ఇప్పుడు సోనాలి కూడా నటిస్తే ఈ సినిమాకు బాలీవుడ్లో సైతం మాంచి డిమాండ్, క్రేజ్ ఉంటుంది.