టాలీవుడ్ సీనియర్ హీరోలుగా ఉన్న యువరత్న నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదిక మీదకు వస్తే చూడాలని చాలా మంది వేచి చూస్తున్నారు. బాలయ్య – చిరును ఒకేవేదిక మీద చూసేందుకు ఎవ్వరికి అయినా రెండు కళ్లు చాలవు. వీరిద్దరి ఇమేజ్లు వేరు.. వీరిద్దరి అభిమానులు వేరు. ఎలా ఉన్నా.. ఎవరు ఔనన్నా.. కాదన్నా దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ ఇద్దరు హీరోల మధ్య బాక్సాఫీస్ వేదికగా పోటీ నడుస్తూనే ఉంది.
నాలుగేళ్ల క్రితం వీరిలో బాలయ్య 100, చిరు 150వ సినిమాలతో కూడా బాక్సాఫీస్ దగ్గర ఒకేసారి పోటీ పడి మరీ పోరును హీటెక్కించారు. వీరిలో బాలయ్య నందమూరి కాంపౌండ్ నుంచి, చిరంజీవి కొణిదెల కాంపౌండ్ నుంచి స్టార్లుగా, సీనియర్లుగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరు ఎప్పుడూ ఒకే వేదిక మీదకు రాలేదు.. అంత సాహసం కూడా ఏ సినిమా వాళ్లో, రాజకీయ నాయకులో చేయలేదు.
అయితే ఇప్పుడు వీరు ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. ఈ కలయిక నిజం.. దీనిని నిజం చేసి చూపిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. యంగ్టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం త్రిబుల్ ఆర్ ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. భారతదేశ సినిమా స్థాయిని బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తీసుకువెళ్లిన రాజమౌళి ఆ సినిమా తర్వాత తీసిన సినిమా కావడంతో మామూలు అంచనాలు లేవు.
అందుకే ఈ సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చేందుకు రాజమౌళి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో గ్రాండ్ గా జరగనున్న ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. దీనిపై రేపో మాపో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రానుంది. ఇక త్రిబుల్ ఆర్ ఈవెంట్లో ఈ ఇద్దరు ఒకేసారి కనిపిస్తే ఇండస్ట్రీ జనాలకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది ?