ఆ 49 మంది ఎవ‌రు.. వైసీపీలో ఒక్క‌టే హాట్ టాపిక్ ?

అధికార పార్టీ వైసీపీ నుంచి 49 మంది ఎమ్మెల్యేలు.. ఒక పార్టీతో ట‌చ్‌లో ఉన్నారంటూ.. నటుడు శివాజీ చేసిన ప్ర‌క‌ట‌న.. రాజ‌కీ యంగా సంచ‌ల‌నం సృష్టించిందో లేదో తెలియ‌దు కానీ.. వైసీపీలో మాత్రం సంచ‌ల‌నంగానే మారుతోంది. నేత‌ల మ‌ధ్య తీవ్ర చ‌ర్చ‌కు కూడాదారితీసింది. అంతేకాదు.. కొంద‌రు నేత‌ల‌ను అనుమానపు చూపులు కూడా వెంటాడుతున్నాయి. “అన్నా ఏంటిది.. ఎవ‌రుంటారు? ఎవ‌రు పోతారు?“ అనే చ‌ర్చ నేత‌ల మ‌ధ్య జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఏ ఇద్ద‌రు నాయ‌కులు క‌లుసుకున్నా.. ఇప్పుడు .. ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా ఆదివారం గుంటూరు వేదిక‌గా.. న‌లుగురు కీల‌క నాయ‌కులు ఓ స‌ల‌హాదారుతో భేటీ అయ్యారు.

ఈసంద‌ర్భంగా శివాజీ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. ఈ న‌లుగురు నేత‌ల్లో ఇద్ద‌రు .. ఆ వ్యాఖ్య‌ల‌ను ఒక కీల‌క నాయ‌కుడు.. ఉద్దేశ పూర్వ‌కంగా చేయించార‌ని.. పార్టీని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టే రాజ‌కీయ వ్యూహంలో భాగంగానే ఈ వ్యాఖ్య‌లు చేయించి ఉంటార‌ని ఆయ‌న అన్నారు. అయితే.. మ‌రో నేత మాత్రం ఈ వ్యాఖ్య‌ల‌ను తీసిపారేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఏదో జ‌రిగే ఉంటుంద‌ని.. అన్నార‌ట‌.

అంతేకాదు.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో తాను ప‌ర్య‌టించిన‌ప్పుడు.. ఎమ్మెల్యేలు కొంద‌రు పార్టీ కార్య‌క్ర‌మాల ప‌ట్ల నిరాస‌క్తంగా ఉన్నార‌ని.. ప్ర‌భుత్వం చేస్తున్న‌ప‌నుల‌పైనా దృష్టి పెట్ట‌డం లేద‌ని.. ఆయ‌న చెప్పుకొచ్చార‌ట‌. ఇక‌, మ‌రో నేత మాట్లాడుతూ.. మా తూర్పు నుంచే 10 మందివ‌ర‌కు.. వెళ్లిపోతార‌ని త‌న‌కు ఎప్ప‌టి నుంచో స‌మాచారం ఉంద‌ని చెప్పార‌ట‌. ముఖ్యంగా త‌మకు సీటు ల‌భించే అవ‌కాశం లేద‌ని అనుకుంటున్నార‌ని.. అందుకే వారు టీడీపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని.. అన్నార‌ట‌. అంతేకాదు.. వార‌సుల‌ను టీడీపీలోకి పంపించేందుకు కొన్ని జిల్లాల్లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎమ్మల్యేలు కూడా ఉన్నార‌ని చెప్పుకొచ్చార‌ట‌.

అయితే.. ఈ మొత్తం విన్న స‌ల‌హాదారు స‌జ్జ‌ల మాత్రం కూల్‌గా రియాక్ట్ అయ్యార‌ట‌. “ఇవ‌న్నీ మామూలే. మ‌నం బ‌లంగా ఉన్నాం. సో.. ఇప్పుడు ఏదో కీచులాట పెట్టి.. మ‌న‌ల్ని.. ఇబ్బందుల‌కు గురి చేయాల‌ని.. పార్టీలో కేడ‌ర్‌ను క‌కావిక‌లం చేయాలి. అందుకే ఇలా చేస్తున్నారు! అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉంటే.. ఎవ‌రు ఎన్ని వ్యూహాలు వేసుకున్నా.. మ‌న‌ల్ని ఏమీ చేయ‌లేరు!“ అని వ్యాఖ్యానించార‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యమే.. పార్టీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిగా మార‌డం గ‌మ‌నార్హం. మ‌రి మున్ముందు.. ఏం జ‌రుగుతుందో చూడాలి.