ఎన్నెన్నో అంచనాల మధ్య చింతలపూడి నియోజకవర్గ రివ్యూను టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ సమీక్షకు పలువురు ఆశావాహులతో పాటు పార్టీ హైకమాండ్ నుంచి ఆహ్వానం అందిన నేతలతో పాటు ఆయా నేతలు బలప్రదర్శనగా తీసుకువెళ్లిన కార్యకర్తలు కూడా వెళ్లారు. గంట పాటు రివ్యూ జరుగుతుందని అనుకున్నా చంద్రబాబు కేవలం 20 నిమిషాలతోనే రివ్యూ ముగించేయడంతో కార్యకర్తలు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే 20 నిమిషాల్లోనే చంద్రబాబు తనకు అందిన నివేదికల ద్వారా నియోజకవర్గ నేతలకు తలంటేశారు.
ఇక రివ్యూకు వెళ్లిన నేతల్లో మాజీ మంత్రి, చింతలపూడికి 2014లో ప్రాథినిత్యం వహించిన పీతల సుజాత వర్గంతో పాటు మాజీ జడ్పీచైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, జంగారెడ్డిగూడెంకు చెందిన వ్యాపారవేత్త ఆకుమర్తి రామారావుతో పాటు మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ వర్గాల నేతలు ఉన్నారు. ఏ వర్గంవారు తమ వర్గం నేతకే టిక్కెట్ ఇవ్వాలని హైకమాండ్కు సూచనలు చేశారు. అయితే మీ రెండో ఆప్షన్ ఏంటన్న ప్రశ్న కూడా వారికి ఎదురైంది. నియోకవర్గంలో వివిధ పదవుల్లో ఉన్న వారిలో ముందునుంచి సుజాత వర్గంగా ఉన్నవారు.. సుజాత సానుభూతిపరులుగా ఉన్న వారు సుజాత పేరునే అధిష్టానం ముందు ఉంచారు. అయితే వీరితో పాటు ఎక్కువ మంది సెకండ్ ఆప్షన్గా ఆకుమర్తి రామారావు పేరుకే ఓటేశారు. ఓవరాల్గా సెకండ్ ఆప్షన్ పరంగా చూసుకుంటే ఆకుమర్తి రామారావు పేరే ఎక్కువమంది నోట నుంచి వినిపించింది.
ఇక కొక్కిరిగడ్డ జయరాజు పేరు చాలా తక్కువ మంది మాత్రమే అధిష్టానానికి సూచించినట్టు సమాచారం. ఇక ఓసీ వర్గానికి చెందిన గంటా మురళీ గత కొద్ది రోజులుగా నియోజకవర్గంపై పట్టుతో పాటు రాజకీయంగా పూర్వవైభవం కోసం ఎలాగైనా ఇన్చార్జ్ పదవి దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజా రివ్యూలో కామవరపుకోట మండలానికి చెందిన పార్టీ నేతలతో పాటు చింతలపూడికి చెందిన కొందరు మురళీకి ఇన్చార్జ్ ఇవ్వాలని ఆయన పేరు సూచించారు. ఇక చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పార్టీ పరిశీలకుడు కొఠారు దొరబాబు సైతం మురళీకి ఎలాగైనా ఇన్చార్జ్ రావాలని తన వంతుగా తెరవెనక మంత్రాంగం నడిపినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నోట ముత్తారెడ్డి పేరు, విద్యాధరరావు పేరు వినిపించినా మురళీ పేరు రాకపోవడం గమనార్హం.
ఇక మాజీ ఏఎంసీ చైర్మన్, పార్టీ సీనియర్ నేత జగ్గవరపు ముత్తారెడ్డికి ఇన్చార్జ్ పదవి ఇవ్వాలని చింతలపూడి మండలానికి చెందిన కొందరు నేతలు పట్టుబట్టారు. అలాగే ఓసీలకే ఈ పదవి ఇవ్వాలనుకుంటే తనకే ఇవ్వాలని ఏలూరు పార్లమెంటరీ జిల్లా రైతు అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు నేరుగానే అడిగేశారు. ఇక ఫైనల్గా చంద్రబాబు దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు ఉన్నప్పుడు చింతలపూడి నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా ఉండేదని.. అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పార్టీ మారిపోయారు.. మాజీ మంత్రి పీతల సుజాత వచ్చాక నియోజకవర్గంలో గ్రూపులు ఎక్కువయ్యాయని ఓపెన్గానే చెప్పేశారట.
ఇక తన వైపు కూడా కొన్ని తప్పులు ఉన్నాయన్న చంద్రబాబు నియోజకవర్గంలో ఎవరేం చేస్తున్నారో ? తన దగ్గర రిపోర్టులు ఉన్నాయని.. పార్టీని నష్టం కలిగించే నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారని సమాచారం. ఇక ప్రొటోకాల్ సమస్యను సైతం పరోక్షంగా ప్రస్తావించిన చంద్రబాబు పార్టీలో క్రమశిక్షణ తప్పుతున్న వారికి సైతం వార్నింగ్ ఇచ్చారు. ఏదేమైనా ఓసీలకు ఈ పదవి అంటూ ఎన్నో ఆశలతో వెళ్లిన నేతలకు రివ్యూ పెద్ద షాకే ఇచ్చింది. అసలు పార్టీ హైకమాండ్ అలాంటి ఆలోచన చేసే దిశగా కనపడలేదు. ఏదేమైనా నియోజకవర్గంలో పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్న బాబు త్వరలోనే చింతలపూడికి ఇన్చార్జ్ను ప్రకటించే ఛాన్సులు ఉన్నాయి.