తెలుగులోకి వచ్చిన తొలి డబ్బింగ్ సినిమా ఏంటో తెలుసా?

ఒక భాషలో హిట్ కొట్టిన సినిమాను పలు భాషల్లోకి రీమేక్ చేయడం లేదంటే డబ్బింగ్ చెప్పి విడుదల చేయడం జరుగుతాయి. అయితే ఓ సినిమా పరిశ్రమలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలను ఇతర భాషల జనాలకు పరిచయం చేసేందుకు దర్శకనిర్మాతలు డబ్బింగ్ చేయిస్తారు. అలా ఇతర భాషల నుంచి తెలుగులోకి వచ్చిన ఎన్నో సినిమాలను తెలుగు జనాలు ఆదరించారు కూడా. ఆయా సినిమాల్లో నటించిన ఇతర సినిమా పరిశ్రమకు చెందిన సినిమా తారలు కూడా తెలుగు జనాలకు దగ్గరయిన వాళ్లు ఉన్నారు. అయితే ఇంతకీ తెలుగులోకి డబ్ అయిన తొలి సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1931 కి ముందు తెలుగు సినిమా తెరపై మాటలు వినిపించేవి కాదు. మూకీ సినిమాలు మాత్రమే వచ్చేవి. ఈ సినిమాలు సైతం జనాలను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే 1931లో తొలిసారి తెలుగు తెరపై మాటలు వినిపించాయి. ఆ తర్వాత నెమ్మదిగా డబ్బింగ్ సినిమాలు రావడం మొదలైంది. 1950లో డబ్బింగ్ సినిమాల సందడి పెరిగింది. అలా తెలుగులోకి వచ్చిన తొలి డబ్బింగ్ సినిమా ఆహుతి. 1946లో బాలీవుడ్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న నీరా ఔర్‌ నందా సినిమా.. తెలుగులోకి 1950 జూన్‌ 22న ఆహుతి పేరుతో విడుదలైంది. జయసింహ, రూప్ బసంత్, శశి, నిశి బరన్‌ సహా పలువురు నటించారు. ఈ సినిమాను జున్నాకర్‌ తెరకెక్కించాడు. తెలుగులో ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పన చేశాడు. ఈ సినిమాతోనే మహాకవి శ్రీశ్రీ వెండితెరకు పరిచయమయ్యాడు. మాటలు, పాటలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అప్పటి వరకు లేని మాటలు తొలిసారి వెండితెరపై వినిపించడంతో జనాలు మంచి అనుభూతికి లోనయ్యారు. నెమ్మదిగా తెలుగులోకి డబ్బింగ్ సినిమాల రాక మొదలయ్యింది. 1953లో ప్రేమలేఖలు.. ఆ తర్వాత రోహిణి సహా పలు బాలీవుడ్ సినిమాలు తెలుగులోకి వచ్చి సందడి చేశాయి. ఆ తర్వాత ఇతర భాషల నుంచి కూడా పలు రీమేక్ సినిమాలు వచ్చాయి.