ప్రశాంతంగా సాగుతున్న శాకుంతలం..!

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తన భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లి సినిమాలు చేస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో నెలకొంది. అయితే అలాంటివారికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఇటీవల రిలీజ్ అయిన పుష్ప – ది రైజ్ చిత్రంలో ఏకంగా ఓ హాట్ ఐటెం సాంగ్‌లో చిందులేస్తూ దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. ‘‘ఊ అంటావా మావా ఊఊ అంటావా’’ అంటూ తెలుగుతో పాటు ఇతర భాషా ప్రేక్షకులను ఉర్రూతలూగించేసింది ఈ సుందరి. ఇక ఇప్పుడు సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న మరో సినిమాతో రెడీ అవుతోంది.

దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్‌లో మైథలాజికల్ మూవీ ‘శాకుంతలం’లో సమంత లీడ్‌రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడో ప్రారంభించిన గుణశేఖర్, ఎక్కువగా లాక్‌డౌన్ సమయంలోనే ఈ సినిమా షూటింగ్‌ను ముగించేశాడు కూడా. అయితే ఈ సినిమాను భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి న్యూఇయర్ కానుకగా ఓ చిన్న క్లిప్పింగ్ వీడియోను రిలీజ్ చేశాడు గుణశేఖర్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో ఉన్నట్లుగా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు.

శాకుంతల, దుశ్యంతుడి ప్రేమగాథను అదిరిపోయే రీతిలో తనదైన మార్క్‌తో చూపించేందుకు గుణశేఖర్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో సమంత అందాల ఆరబోత కూడా ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తుండగా, దుర్వాస మునిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ భార్య నీలిమ గుణ ప్రొడ్యూస్ చేస్తుండగా, మరో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పిస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరలో థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి శాకుంతలం చిత్రంతో సమంత ఎలాంటి హిట్ అందుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.