భార‌త్‌లో నిన్నొక్క రోజే 501 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?

క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి.

గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుండ‌గా.. నిన్న మాత్రం మ‌ర‌ణాలు భారీగా పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 12,516 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,44,14,186 కు చేరుకుంది. అలాగే నిన్న 501 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ‌గా.. దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,62,690 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 13,155 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,38,14,080 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం 1,37,416 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.