సినీ ఇండస్ట్రీకి పెద్ద లేరూ .. రారూ.. రాబోరూ.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఏం చేసినా సంచలనమే.. అని అంటుంటారు. ఆయన ఏ విషయాన్ని మనసులో దాచుకోరు.. నిజాన్ని నిక్కచ్చిగా చెబుతారని పేరు. అలా పలు సందర్భాల్లో వివాదాస్పద కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. వజ్రోత్సవాల సమయంలో చిరంజీవిని సీనియర్ పెద్దలు లెజెండ్ అనే బిరుదుతో సత్కరించగా చిరంజీవి ఒక్కడే లెజెండా.. అని మోహన్ బాబు గొడవ పడ్డ సంగతి తెలిసిందే. ఆ వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.

ఆ తర్వాత ఒకసారి అక్కినేని నాగేశ్వరావు సభలో కూడా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నొచ్చుకుని..కాస్త కోపంగానే మాట్లాడారు. అయితే అప్పుడు పక్కనే ఉన్న చిరంజీవి ఇద్దరికీ సర్ది చెప్పారు. తాజాగా మరోసారి మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దాసరి నారాయణరావు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని.. ఆయన తర్వాత ఎవరూ లేరూ.. రారూ.. రాబోరూ.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

మోహన్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దాసరి తర్వాత సినీ పెద్దగా చిరంజీవి ట్రై చేస్తున్నాడుగా.. అని మోహన్ బాబును ప్రశ్నించగా..’ఎగతాళా..ఇప్పుడు సినిమా పెద్దలు ఎవరు లేరూ.. దాసరిగారితో అది పోయింది. ఇకపై ఎవరూ లేరూ.. రారూ.. రాబోరూ.. ఎవరైనా సినిమా పెద్ద అని..ప్రకటించుకుంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా.’ అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

కొన్నేళ్ల కిందటి వరకూ చిరంజీవి,మోహన్ బాబుకు పడొద్దు.. అనే విధంగా పరిస్థితి ఉండేది. అయితే ఇటీవలి కాలంలో మోహన్ బాబు, చిరంజీవి బాగా దగ్గరయ్యారు. కాగా.. మా ఎన్నికలు చిరంజీవి,మోహన్ బాబు మధ్య మళ్లీ చిచ్చు పెడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశ్న వేసినా కూడా మోహన్ బాబు సమాధానం చెప్పకుండా దాటవేశారు.