భట్టి ప్రశ్నకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారో..?

దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.. దళిత కుటుంబాలకు రూ. పది లక్షలు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారు. కొన్ని కుటుంబాలకు ఈ మొత్తం అందింది కూడా. అయితే ఇపుడు కాంగ్రెస్ సీనియర్ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సరికొత్త ప్రశ్న, అనుమానం లేవనెత్తారు. దళితబంధు కింద ఇస్తున్న రూ. పది లక్షల డబ్బు మొత్తం రాయితీగా ఇస్తారా, లేక రుణం రూపంలో ఇస్తారా చెప్పాలని కోరుతున్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ. 10 లక్షలు వ్యాపారానికి ఇస్తున్నా.. దానిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో జరిగన సమావేశంలో ఇదే అంశంపై మాట్లాడానని భట్టి చెప్పారు.

భట్టి లేవనెత్తిన ఈ అనుమానంపై ప్రభుత్వ పెద్దల నుంచి ఇంకా సమాధానం రాలేదు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లోనే కాక రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎంత మందికి ఏ సంవత్సరం ఇస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వాలాని కోరారు. అయితే టీఆర్ఎస్ నాయకులు మాత్రం విషయంపై స్పందించడం లేదు. దళితబంధు పథకంపై ఏమైనా మాట్లాడాలంటే కేవలం కేసీఆరే మాట్లాడుతున్నారు.. మిగతా నాయకులంతా ఈ టాపిక్ పై సైలెంట్.. ఒకవేళ మాట్లాడితే సీఎం కు మద్దతుగా మాట్లాడతారు తప్ప.. పథకం గురించి మాట్లాడరు. ఏ నియోజకవర్గంలో పథకం అమలు చేయాలి? ఎన్ని కుటుంబాలకు ఇవ్వాలి? ఏ సంవత్సరం ఎంత మొత్తం ఇవ్వాలి? అనే విషయాలు మొత్తం సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ చూసుకుంటున్నారు. ఈ పథకానికి భారీ మొత్తం కావాల్సి ఉండటంతో అంతా సీఎం ఆధ్వర్యంలో పథకం నడుస్తోంది. అధికారులు కూడా ఎవ్వరూ నోరు మెదపడం లేదు.