కొవిడ్ సెకండ్ వేవ్ సుడిగాలిలా విజృంభిస్తున్నది. మహమ్మారి పంజాకు వేలాది మంది ప్రాణాలను కోల్పోతుండగా, లక్షలాదిమంది గజగజ వణుకుతున్నారు. ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి కరోనా ఎప్పటి వరకు ఉంటుందనే విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది ఉగాది రోజున(ఏప్రిల్ 13వ తేదీన) పంచాంగ విశ్లేషణ సందర్భంగా కరోనా తీవ్రత గురించి ప్రస్తావించారు. కరోనా తీవ్రత ఎలా ఉండబోతుందన్న అంశంపై స్పష్టమైన విశ్లేషణ చేసారు.
అదేమంటే ఈ ఏడాది అన్ని గ్రహాలు రాహువు – కేతువు మధ్యలో ఉన్న కారణంగా ఇబ్బందికరమైన సంవత్సరమే అవుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. కుజుడు కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ ఇబ్బందులు తప్పవని తెలిపారు. జూలై 20వ తేదీ వరకు కరోనా మహమ్మారి బలంగా ఉంటుందని విశ్లేషించారు. కరోనా తీవ్రత ఎప్పటికి తగ్గుతుందనేది ఆ తర్వాతే నిర్ణయం చేయాలి తప్ప, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆయన స్పష్టం చేశారు. అయితే స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి చేసిన పంచాంగ విశ్లేషణ గురించి అవగాహన లేని కొందరు సోషల్ మీడియా వేదికగా లేనిపోని ప్రచారం చేస్తుండ డం గమనార్హం. దీనిని విశాఖ శారదాపీఠం తీవ్రంగా ఖండిస్తున్నది. పీఠాధిపతుల విశ్లేషణను ఈ మధ్య ఒక దినపత్రిక తమకు తోచిన విధంగా ప్రచురించిందని ఆక్షేపించడమేగాక, స్పష్టత కోసం ఉగాది రోజున విశాఖ శారదాపీఠం అధికారికంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనను మరోసారి విడుదల చేసింది.