కరోనా చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన 2-డయాక్సి-డీ గ్లూకోజ్(2డీజీ) ఔషధం విడుదలైంది. ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తొలి బ్యాచ్ 2 డీజీ సాచెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కు అందించారు. ఆరోగ్యమంత్రి వాటిని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు అందజేశారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. 2డీజీ డ్రగ్ తో కరోనా రికవరీ సమయం తగ్గడంతో పాటు ఆక్సిజన్ అవసరం కూడా తగ్గుతుందని అన్నారు. కరోనాపై పోరాటం చేయడంలో డీఆర్డీఓ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.
ఈరోజు తొలి విడతలో భాగంగా 10వేల సాచెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మే 27, 28 తేదీల్లో రెండో విడతలో భాగంగా మరిన్ని సాచెట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జూన్ నాటికి ఇవి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వెల్లడించింది. అయితే ఈ మందు ధరను డీఆర్డీవో ఇంకా ప్రకటించలేదు.