కంటికి కనిపించకుండా ఎందరో ప్రాణాలను బలి తీసుకున్న ప్రాణాంతక కరోనా వైరస్.. సెకెండ్ వేవ్లో మరింత వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులనే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా సీపీఎం సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది.
కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుముూశారు. 34 ఏళ్ల వయసున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకగా.. గురుగావ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. అక్కడ వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున ఆశిష్ తుదిశ్వాస విడిచారు.
కుమారుడు మృతి చెందిన విషయాన్ని సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా ప్రకటించారు. దీంతో ఆశిష్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆశిష్ ఏచూరి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు.