తెలంగాణ‌లో భ‌య‌పెడుతున్న క‌రోనా..భారీగా కొత్త కేసులు!

అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసి ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో అని ప్ర‌జ‌లు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌ళ్లీ భారీగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 887 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 3,08,776 కి చేరింది. నిన్న న‌లుగురు క‌రోనా కార‌ణంగా మృతి చెందారు.

దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,701 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 337 మంది రిక‌వ‌రీ అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 3,01,564 కు చేరుకుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 5,511 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 2,166 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, తెలంగాణలో నిన్న‌ 59,297 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.