మ‌ట్టితో కోట్లు కొల్ల‌గొట్టిన టీడీపీ ఎమ్మెల్యే

అదృష్టం ఉండాలే కానీ.. మ‌ట్టిప‌ట్టుకున్నా బంగారం అయిపోద్ది అంటారు.. కానీ టీ డీపీ ఎమ్మెల్యే విష‌యంలో తెలివి ఉంటే.. చాలు.. కోట్లు సంపాయించేయొచ్చు అన్న విష‌యం వెలుగు చూసింది. అదేస‌మ‌యంలో అధికారం ఉండాలే కానీ.. వ్యాపారం ఏదైతేనేం.. కోట్లు రాబ‌ట్టేయొచ్చు. వాటిని వెనుకేసేయొచ్చు అని కూడా నిరూపిత‌మైంది! ఇప్పుడు ఇదే ఫార్ములా ఫాలో అయిపోతున్నారు విజ‌య‌వాడ శివారుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే. 2014లో గెలిచిన ఈ ఎమ్మెల్యే.. బాబు ప్ర‌వేశ పెథ‌కాల‌ను త‌న‌కు రాబ‌డిగా మార్చుకున్నారు. ఇందులో మోసం లేదు, ద‌గా లేదు. మ‌ట్టి అమ్మేసి.. కోట్లు కూడ‌బెట్టేస్తున్నాడు ఆ ఎమ్మెల్యే క‌థేంటో చూద్దామా? రాజ‌ధాని జిల్లా అయిన కృష్ణాలో అతి ప్ర‌ధాన ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. పోలవరం కుడికాల్వ , చెరువుల తవ్వకాలు, పంట కుంటలు ఇలా మట్టితో ముడిపడి ఉన్న బోలెడు పథకాలు ఏపీలో సాగుతున్నాయి.

వీటిపై క‌న్నేసిన స‌ద‌రు ఎమ్మెల్యే 300 లారీలను కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. పూడిక తీత., కాల్వల తవ్వకం వంటి పనులకు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందడంతో పాటు అదే మట్టిని అమ్ముకోవడం ద్వారా రెండు విధాలుగా లబ్ది పొందినట్లు ఆయ‌న అనుచరులు చెబుతున్నారు. ఇక పెద్ద ఎత్తున జరుగుతున్న రోడ్ల విస్తరణ., అభివృద్ధి పనులు., మెరక చేయడం వంటి పనులకు ఇదే మట్టిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్‌ లోడింగ్‌కు రూ.2 వేలు వసూలు చేయడం ద్వారా రోజుకు ఆరేడు లక్షల ఆదాయం పోగేసుకుంటున్నారు.

అదేవిధంగా చంద్ర‌బాబు చేప‌ట్టే ప్ర‌తి ప‌థ‌కాన్నీ ఈ ఎమ్మెల్యే త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్న‌ట్టు అనుచ‌రులు చెబుతున్నారు. అయితే, దీనిలో మోసం, ద‌గా ఏమీ లేక‌పోవ‌డంతో ఎవ‌రూ ఏమీ వంక‌లు పెట్ట‌లేక‌పోతున్నారు. ఇక‌, ప్ర‌త్య‌ర్థులు అయితే.. త‌మ‌కు సంపాయించ‌డం చేత‌కాలేదే! అంటూ నోరెళ్లబెడుతున్నారట. ఇక ఇదే మట్టి అపార్ట్‌మెంట్లు., ఇళ్లకు విక్రయించి లోడ్‌ ఆరేడు వేల వరకు అమ్ముతున్నారు. ఇలా మూడున్నరేళ్లలో రూ.250 కోట్లకు పైగా కూడబెట్టిన ఆ నేతను చూసి ఆయన ప్రత్యర్ధులు తెగ బాధపడిపోతున్నారు. ఏదేమైనా.. తెలివి ఉండాలే కానీ.. ఆదాయానికి లోటేంటి.. చెప్పండి!