ఏపీలోని మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుని.. టీడీపీ విజయగర్వంతో ఉంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత సొంత జిల్లా కడపలో సైకిల్ రయ్య్ మంటూ దూసుకుపోయింది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. అయితే ఈ గెలుపు టీడీపీకి లాభమని నేతంతా భావిస్తున్నారు. కానీ ఇది సీఎం చంద్రబాబుకు, టీడీపీకి నష్టమనేది విశ్లేషకుల అంచనా! విజయం సాధించినా.. అధికార ప్రభావం వల్లే టీడీపీ సాధించిందనే భావన ప్రజల్లో నెలకొంది. పైగా ఈ ఎన్నికల్లో ప్రజలు పాల్గొనలేదు. కేవలం లోకల్ బాడీస్ మాత్రమే పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ విజయాన్ని బలుపుగా భావిస్తే 2019లో టీడీపీకే భారీ నష్టమని అంచనా వేస్తున్నారు!!
ఏపీలోని మూడు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన గెలుపు ఎవరి ఖాతాలో పడాలన్నదే చర్చ. ఎలా గెలిచామనేది కాదు. గెలిచామా! లేదా అన్నదే పాయింట్ అనేది దేశం వాదన. నైతికంగా వైసీపీయే గెలిచిందనేది ఫ్యాన్ ఫాలోయర్స్ అభిప్రాయం. అధికార పార్టీ మూడు సీట్లకు 300 కోట్లు రూపాయలు ఖర్చుపెట్టిందని.. ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఇవి ప్రజల ఓట్లతో గెలిచినవి కాదు..కేవలం లోకల్ బాడీస్, ఇక కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీకే బలం ఉంది. కానీ ఓట్ల కొనుగోలు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు.
అధికారం చేతిలో ఉందన్న గర్వంతో డబ్బును టీడీపీ విచ్చలవిడిగా వెదజల్లిందని వైసీపీ విమర్శిస్తోంది. ఇందులో కొంత వాస్తవం ఉన్నా.. ప్రస్తుతం అధికారంలో ఉంది కనుక కేవలం ఇలా దృష్టిసారించారు. దీంతో కోట్ల రూపాయలు వెదజల్లారు. ఇక 2019 ఎన్నికల్లోనూ ఇదేసీన్ రిపీట్ అవుతుందని భావిస్తే కష్టమే! ఎందుకంటే 2019లో ఎవరికి వారు తమ నియోకవర్గాలకే పరిమితమవుతారు. అందులోనూ ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. దీనిని బలుపుగా భావిస్తే చంద్రబాబుకే 2019లో భారీ నష్టం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ గెలుపును అధికార పార్టీ గొప్పతనం భావించి అతివిశ్వాసం ప్రదర్శిస్తే దెబ్బతినే ప్రమాదం ఉందనేది గత ప్రభుత్వాలను చూస్తే అర్ధమవుతోంది. ఎన్నికల బరిలో విజయం సాధించిన పార్టీకు ప్రజల ఆదరణ ఉండటం వెనుక మరో ఆంతర్యాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. అదే ప్రత్యర్థి పార్టీల బలహీనత. 2014లో టీడీపీ బలంకన్నా.. వైసీపీ బలహీనత, విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ రెండు పార్టీలనూ ప్రజలు దూరంగా ఉంచారు. ఆ బలహీనత టీడీపీకు బలంగా మారింది. ప్రస్తుతం టీడీపీపై ఏపీ ప్రజల్లో సానుకూల ప్రభావం వున్న మాట నిజమే. అంతమాత్రాన.. 2019లోనూ ఇదే విధంగా ఉంటుందనేందుకు అవకాశం లేదు.