సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి! బాలయ్య వ్యక్తిగత కార్యదర్శి శేఖర్పై చెలరేగిన అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. చినుకు చినుకు గాలివానలా మారి నియోజకవర్గం మొత్తం అతలాకుతలం అవుతోంది. అంతేగాక ఈ సెగల తాకిడి బాలకృష్ణకు డెడ్లైన్ విధించే స్థాయికి చేరుకుంది. బాలయ్య తనకు పీఏ కావాలో.. పార్టీ కావాలో తేల్చుకోవాలో నిర్ణయించుకోవాలని నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ నేతలు అల్టిమేటం జారీచేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఇంత జరుగుతున్నా.. జిల్లాకు చెందిన కీలక నేతలు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి!!
కొంతకాలంగా హిందూపురంలో నెలకొన్న అధికారపక్ష అసంతృప్త రాజకీయాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు వియ్యంకుడు కమ్ బావమరిది.. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాలయ్య పీఏ శేఖర్ ఆరాచకాలు రోజురోజుకి శ్రుతిమించటం.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటంతో పాటు.. పలువురిని బెదిరిస్తున్నవైఖరిపై స్థానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే! ఇంత జరుగుతున్నా శేఖర్ మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం! దీనికి తగ్గట్లే రెండురోజుల క్రితమే ఒక కాంట్రాక్టర్ ను బెదిరించిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. అందులో శేఖర్ మాట్లాడిన మాటలు.. వాడిన భాష సంచలనం సృష్టించాయి.
టీడీపీ అసంతృప్త నేతలు భేటీ అయి.. సుదీర్ఘంగా చర్చించి.. పీఏ శేఖర్ విషయంలో బాలయ్యకు వారం డెడ్ లైన్ ఇచ్చారు. `వారం రోజులే డెడ్ లైన్. ఈలోపు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తనకు పీఏ శేఖర్ కావాలో.. పార్టీ కావాలో తేల్చుకోని ఆయన్ను ఇక్కడి నుంచి పంపకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేయటమే కాదు.. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరాహారదీక్ష చేస్తాం` అని ఓపెన్ గా డెడ్ లైన్ ఇచ్చేశారు. మరి.. ఈ వ్యవహారంపై బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
శేఖర్ను హిందూపురం నుంచి పంపించి వేసి ఆ స్థానంలో ఓ అధికారిని నియమిస్తే పార్టీ శ్రేణులకు గుర్తింపు ఉంటుందనే డిమాండ్తో వారు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు. గత ఆదివారం కిరికెర తోటలోనూ, ఆతర్వాత లేపాక్షిలోనూ సమావేశాలు నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో ఆత్మరక్షణలో పడిన శేఖర్ తనకు అనుకూలంగా కొందరిని కూడగట్టుకుని శనివారం ఉదయం లేపాక్షిలో ర్యాలీ చేయించారు. ఆదివారం శేఖర్ వ్యతిరేకులను నిర్బంధించే ప్రయత్నాలు చేయడంతో వారంతా కర్ణాటక సరిహద్దులో నిరసన సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లో శేఖర్ను పంపించకపోతే నిరాహార దీక్షలకు దిగుతామని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు ప్రకటించారు.