తమిళనాడు సీఎం, పురుచ్చితలైవి జయలలిత మృతి తమిళనాట అన్నాడీఎంకే రాజకీయాలను కాస్త సంక్షోభంలో పడేసింది. ప్రస్తుతానికి అమ్మకు నమ్మినబంటుగా ఉన్న మాజీ సీఎం పన్నీరుసెల్వం మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినా, భవిష్యత్తులో అన్నాడీఎంకే పగ్గాలు ఎవరు చేపడతారు ? ఈ ప్రశ్నకు జయలలిత తాను చనిపోక ముందే ఆన్సర్ రెడీ చేసినట్టు అన్నాడీఎంకే వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
జయలలిత తర్వాత అన్నాడీఎంకే పగ్గాల కోసం పన్నీరు సెల్వంతో పాటు సెల్వ రాజన్, అమ్మ నెచ్చెలి శశికళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరికి ప్రజల్లో సరైన ఆదరణ మాత్రం లేదు. వీరిలో పన్నీరుసెల్వం కాస్త ముందంజలో ఉన్నారు. అయితే ప్రతిపక్షంలో డీఎంకే నుంచి బలమైన కరుణానిధి, స్టాలిన్ వంటి బడా నేతలు ఉండడంతో వారిని ధీటుగా ఎదుర్కొనే నాయకులు అన్నాడీఎంకేకు అవసరం.
ఈ క్రమంలోనే మన తెలుగు వాడైన, సికింద్రాబాద్లో జన్మించి కోలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్న తల అజిత్ను జయ తన వారసుడిగా ఎప్పుడో డిసైడ్ చేసినట్టు ప్రస్తుతం అన్నాడీఎంకే వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను చనిపోకముందే జయలలిత అజిత్ పేరు ప్రతిపాదించినట్టు ఇప్పుడు అన్నాడీఎంకే వర్గాల్లో చర్చ జరుగుతోంది. అజిత్ జయను అమ్మ అని పిలుస్తుంటాడు. తనకు అమ్మ తర్వాత అమ్మ జయమ్మే అని ఎన్నోసార్లు చెప్పాడు.
సినిమా రంగంలో అజిత్కు జయమ్మ సపోర్ట్ ఎంతో ఉండేది. జయ నివాసమైన పొయెస్ గార్డెన్కు నేరుగా చేరుకునే అతి కొద్ది మంది వ్యక్తుల్లో అజిత్ ఒకరు. ఇక జయలలిత తాను ఉన్నన్ని రోజులు అన్నాడీఎంకేలో నెంబర్ 2 ప్లేస్ అంటూ లేకుండా చేయడంతో ఇప్పుడు అన్నాడీఎంకే బలమైన నాయకుడు అంటూ ఎవ్వరూ లేకుండా పోయారు. తమిళనాట జయలలిత, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ అజిత్ సొంతం.
జయలలిత కూడా తన మరణాంతరం పన్నీరుసెల్వంను ముఖ్యమంత్రిగా చేసి 2021 ఎన్నికల నాటికి అజిత్ను అన్నాడీఎంకేలో తిరుగులేని నాయకుడిగా చేసి, అజిత్ అన్నాడీఎంకే పగ్గాలు అప్పగించాలని ఇప్పటికే అన్నాడీఎంకే వర్గాలకు సైతం చెప్పినట్టు తెలుస్తోంది. అదే జరిగితే మన తెలుగు వాడైన అజిత్ను ఫ్యూచర్లో తమిళనాడు సీఎంగా చూడొచ్చు.