జ‌యకు వ్య‌తిరేకంగా శ‌శిక‌ళ కుటుంబం కుట్ర‌!

త‌మిళ‌నాడులో అమ్మ‌గా పూజ‌లందుకున్న మాజీ సీఎం జ‌య‌ల‌లిత ఇప్పుడు లేరు. కానీ, ఆమె జ్ఞాప‌కాలు ఉన్నాయి. ఆమె వ‌దిలి వెళ్లిన వంద‌ల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆమె ఎంత‌గానో ఇష్ట‌ప‌డిన మ‌నుషులు ఉన్నారు. ఇంత వ‌ర‌కే అంద‌రికీ తెలుసు! కానీ, ఆన‌మ్మిన మ‌నుషులే అమ్మ వెనుక కుట్ర‌లకు తెర‌దీశార‌ని, అమ్మ ప‌త‌నాన్ని కోరుకున్నార‌ని, అమ్మ అధికారం కోల్పోతే తాము అధికారంలోకి రావాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నార‌ని తెలుసా?? కానీ, ఇది నిజ‌మ‌ట‌! అమ్మ‌ను ఎంతో అభిమానిస్తున్నామ‌ని, అమ్మ‌లేనిదే తాము లేమ‌ని చెప్పుకొనే నెచ్చెలి శ‌శిక‌ళ కుటుంబ‌మే అమ్మ‌కు సెగ పెట్టేందుకు ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకుంద‌ట‌!!

న‌మ్మ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టినా.. ఇది నిజ‌మ‌ని అంటున్నారు అన్నాడీఎంకే వ‌ర్గాలు. దేశ‌వ్యాప్తంగా అనేక సంచ‌ల‌నాల‌ను వెలుగులోకి తెచ్చిన తెహల్కా ప‌త్రిక గ‌తంలోనే ఈ విష‌యాన్ని, ఈ కుట్ర‌ల కోణాన్ని వెలుగు లోకి తెచ్చింది. రిపోర్టర్ జీమన్ జాకబ్ 2012లో రాసిన కథనం ప్రకారం జయ ఆస్తుల కేసును బెంగళూరుకు తరలించడం వెనుక ఆమె నెచ్చిల శశికళ బంధుగణం పెద్ద స్కెచ్ ఉంద‌ట‌! అంతేకాదు, ఆస్తుల కేసులో చిక్కిన జ‌య జైలుకు వెళ్తే.. ఆమె పీఠాన్ని ఎవ‌రు చేజిక్కించుకోవాల‌నే విష‌యంపైనా శ‌శిక‌ళ కుటుంబం పెద్ద ఎత్తున చ‌ర్చించింద‌నే సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది.

ఈ కుట్ర కోణాన్ని అప్ప‌టి కర్నాటక డీజీసీ శంకర్ బీదారి జయకు విశ్వాసపాత్రుడైన తమిళనాడు డీజీపీ రామానుజంకు చేరవేయడంతో జ‌య ఉలిక్కిప‌డ్డార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే అప్ప‌ట్లో చెప్పాపెట్ట‌కుండా శ‌శిక‌ళ‌ను ఆమె భ‌ర్త న‌ట‌రాజ‌న్ స‌హా అంద‌రినీ పార్టీ నుంచి అమ్మ బ‌హిష్క‌రించింది. అయితే, ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు మ‌ళ్లీ శ‌శి అమ్మ‌కు ద‌గ్గ‌రైంది. అంతేకాదు, జ‌య‌పై స్లోపాయిజ‌న్ ప్ర‌యోగం కూడా జ‌రిగింద‌నే ప్ర‌చారం కూడా నిజ‌మేన‌ని తెహ‌ల్కా ప‌త్రిక పేర్కొన‌డం గ‌మ‌నార్హం. జ‌య‌కు నిద్రమాత్రలు రసాయనాల రూపంలో కొద్ది కొద్దిగా విషం ఎక్కిస్తున్నట్టు వైద్యపరీక్షల ద్వారా బయటికి వచ్చినట్టు ప‌త్రిక పేర్కొంది. ఇలా.. జ‌య‌కు వ్య‌తిరేకంగా అప్ప‌ట్లోనే శ‌శిక‌ళ కుటుంబం కుట్ర ప‌న్నింద‌నే వార్త‌లు ఇప్పుడు త‌మిళ‌నాడు వ్యాప్తంగా హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.