అవును! ఏపీలో ఎంతో ఎత్తుకు ఎదగాలని.. కమల దళాధిపతి అమిత్ షా మాటల్లో చెప్పాలంటే నేరుగా అధికారంలోకే వచ్చేయాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్న బీజేపీకి ఇప్పుడు ఏపీలో వాయిస్ కట్ అయింది!! ఇంకొంచెం ఘాటుగా చెప్పాలంటే.. బీజేపీ మర్డరే అయిపోతోంది! పెద్ద నోట్ల రద్దుతో వెల్లువెత్తుతున్న ప్రజా గ్రహాన్ని తమపై పడకుండా చూసుకునే క్రమంలో తెలుగుదేశం నేతలు ఏకంగా బీజేపీని బోనులోకి ఎక్కించేసి.. చుట్టూ చేరి రాళ్లేస్తున్నారు. ఈ క్రమంలో మరి బీజేపీని కాపాడుకునేందుకు, దానిపై ఈగైనా వాలకుండా చేసుకునేందుకు యత్నించాల్సిన ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు బూతద్దం పట్టుకుని వెతికినా ఎక్కడా కనిపించడం లేదు.
నిన్నమొన్నటి వరకు కేంద్రం పెద్ద ఎత్తున డబ్బులు కుమ్మరిస్తున్నా బాబు తక్కువ చేసి చెబుతున్నారంటూ.. బీజేపీ నేతలు రోజుకు రెండు చోట్ల ప్రెస్ మీట్లు పెట్టి మరీ చంద్రబాబు సర్కారుపై పరోక్ష విమర్శలు చేసేవారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన పురందేశ్వరి మరో అడుగు ముందుకేసి మరిది అని కూడా చూడకుండా సీఎంని ఉతికి ఆరేశారు. లెక్కలు చెప్పడం లేదని, స్వేత పత్రం విడుదల చేస్తే.. అప్పుడు కేంద్రం ఎంత ఇచ్చిందో తెలుస్తుందని కూడా మె కామెంట్లు చేశారు. మరి అలాంటి నేతలు.. ఇప్పుడు నేరుగా టీడీపీ తమ్ముళ్లు.. మోడీని టార్గెట్ చేస్తుంటే.. ఇదో పనికిమాలిన నిర్ణయమని హరికథలు, బుర్రకథల రూపంలో ప్రజలకు యాంటీ మెసేజ్ పంపుతుంటే వీరంతా ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్న వస్తోంది.
నిజం చెప్పాలంటే.. రాష్ట్రంలో తాము భాగస్వామ్య పక్షంగా ఉన్నా న్యాయం జరగడం లేదని కొన్నాళ్ల కిందట ఏపీ కమలం నేతలు గొంతు ఎత్తారు. నామినేటెడ్ పదవులను సైతం బాబు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కార్యాలయంలో పెద్ద ఎత్తున దాడి కూడా జరిగింది. అయితే, దీనిపై వెంటనే స్పందించిన బీజేపీ అధిష్టానం.. ఏం మంత్రం వేసిందో తెలీదు.. ఆ రెండో రోజు నుంచి బాబును అడిగేవారు, ప్రశ్నించేవారు బీజేపీలో కరువయ్యారు. దీనివెనుక కేంద్రంలో ఉన్న వెంకయ్య చక్రం తిప్పారని, బాబుకు అనుకూలంగా మాట్లాడలేకపోతే, కనీసం మౌనంగా ఉండండని ఆయన చెప్పించారని అంటారు. ఈ క్రమంలోనే వెంకయ్య ఎప్పుడు ఏపీకి వచ్చినా బాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇక, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టీడీపీ నేతలు బీజేపీ ముఖ్యంగా మోడీ టార్గెట్గా విరుచుకుపడుతున్నా.. బీజేపీ నేతలు ఎదురు విమర్శలు చేయడం కానీ, వాళ్లకి సమాధానం చెప్పడం కానీ చేయడంలేదు. మోడీ తీసుకున్నది మంచి నిర్ణయం అని చెబుతున్పప్పుడు.,. భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ ఎందుకు విమర్శిస్తోందని ప్రశ్నించేవారు కరువయ్యారు. దీంతో ఇప్పుడు ఏపీలో బీజేపీ వాయిస్ పూర్తిగా కట్ అయిందని కొందరు అంటుంటే.. లేదు లేదు.. వెంకయ్య, మంత్రలు కామినేని వంటివారే బీజేపీని మర్డర్ చేస్తున్నారనే వాళ్లు కూడా కనిపిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.