టీడీపీలో మంత్రి వర్గ విస్తరణ సరికొత్త లీకులకు వేదికగా మారుతోంది. ఫలానా వ్యక్తి మంత్రి పదవి పోతుందని.. ఆ స్థానంలో మరోవ్యక్తి మంత్రి అవుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా అనంతపురానికి చెందిన మంత్రి పల్లె రఘనాథరెడ్డికి కూడా ఈసారి ఉద్వాసన తప్పదనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అంతేగాక పల్లె స్థానంలో అదే జిల్లాకు చెందిన పయ్యవుల కేశవ్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ఈ లీకుల వెనుక కేశవ్ ఉన్నాడని, మంత్రి పదవి పొందేందుకే ఇటువంటి ప్రచారం తన వర్గీయులతో చేయిస్తున్నాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్కు మధ్య కొంత గ్యాప్ ఉంది. కానీ పల్లె మృదు స్వభావి కావడంతో పాటు అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం, అవినీతిపరుడు కాకపోవడం, తన ప్రత్యర్థులతోనూ మాట్లాడే స్వభావం ఉండటం మొదటి నుంచీ కలిసివస్తున్న అంశాలు! ప్రస్తుతం మంత్రి వర్గ విస్తరణలో ఎవరి సీటు ఉంటుందో ఎవరి సీటు ఊడుతుందో తెలియక మంత్రులంతా టెన్షన్ టెన్షన్ పడుతున్నారు. అయితే అనంతపురం నుంచి పరిటాల సునీతతో పాటు రఘునాథరెడ్డి కూడా మంత్రి వర్గంలో ఉండటంతో ఈసారి పల్లెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది.
అయితే జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ పల్లెను మంత్రి వర్గంలో ఉంచాలని కోరుకుంటున్నారట, చివరకు పయ్యావుల కేశవ్ కూడా పార్టీ సమావేశాల్లో పల్లెను సపోర్ట్ చేస్తున్నాడని, పరస్పర శత్రవులైన దివాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరిలాంటి వాళ్లు కూడా పల్లెను సమర్ధిస్తున్నారట. చివరికి బాలకృష్ణ కూడా మంత్రివర్గంలో పల్లె ఉండాల్సిందేనని గట్టిగా పట్టుపడుతున్నాడట. తీసేస్తే ఇద్దరు మంత్రులను తీసేయండి లేదా ఇద్దరినీ ఉంచండి అని గట్టిగా చెప్పాడట. మరి ఇంతమంది సపోర్ట్ ఉన్నా.. పదవి నుంచి తీసేస్తారనే ప్రచారాని పయ్యావుల కేశవే కారణమట.
పయ్యావుల కేశవ్కు మంత్రి పదవి వస్తుందని, తీసేసే మంత్రుల్లో పల్లె పేరు ఉందని ప్రముఖంగా వార్తలు రావడానికి కారణం కేశవేనని, ఇలాంటి లీకులు ఆయననుంచే వస్తున్నాయని కొందరు అనుమానిస్తున్నారు. ఇలాంటి వార్తలు ప్రముఖంగా ప్రచారం కావడం వల్ల కేశవ్కు మంత్రి పదవి వచ్చినా రాకపోయినా అధికార యంత్రాంగం మాత్రం భవిష్యత్తులో మంత్రి అవుతాడన్న భయంతో కేశవ్ పనులు చేసి పెడుతున్నారని ఆయనకు కావాల్సింది కూడా అదేనని, అందుకే అలాంటి ఎత్తుగడలు వేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాయలసీమలో రెడ్ల బలాన్నిపెంచుకోవాలని చూస్తున్న చంద్రబాబు.. పల్లెను తప్పిస్తారో లేదో వేచిచూడాలి.