మళ్ళీ పవన్ రెండుసీట్లలో..ఈ సారి ఛేంజ్?

ఈ సారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..మళ్ళీ రెండు సీట్లలో పోటీ చేస్తారా? లేక ఒక సీటులోనే పోటీ చేస్తారా? అనే అంశాలపై చర్చ ఎప్పటినుంచో జరుగుతూనే వస్తుంది. కానీ ఇంతవరకు ఆయన పోటీ చేసే సీటు ఏంటి అనేది తేలలేదు. దీంతో ఆయన పోటీ చేసే సీటుపై రకరకాల ప్రచారాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ సారి ఆయన తిరుపతిలో పోటీ చేస్తారని మొదట నుంచి ప్రచారం వస్తుంది.

కాదు కాదు ఆయన పిఠాపురంలో పోటీ చేస్తారని, అలాగే కాకినాడ రూరల్ లో , భీమిలిలో అని, నరసాపురంలో అని, తాడేపల్లిగూడెం అని..ఇవన్నీ కాదు మళ్ళీ ఆయన భీమవరం, గాజువాకల్లో పోటీ చేస్తారని ఎప్పుడు ఆయన సీటుపై ఇలా ప్రచారం వస్తూనే ఉంది. ఇప్పుడు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ సారి కూడా ఆయన రెండు సీట్లలోనే పోటీ చేస్తారని..కానీ గత ఎన్నికల్లో పోటీ చేసిన సీట్లలో కాదని..కొత్త సీట్లలో బరిలో ఉంటారని అంటున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ రూరల్, పిఠాపురం సీట్లలో ఆయన పోటీ చేస్తారని, దీని ద్వారా తూర్పులో జనసేన ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇది కూడా అధికారికంగా జనసేన నుంచి వచ్చిన  సమాచారం కాదు..కేవలం ప్రచారమే. కాబట్టి దీని నమ్మడానికి లేదు.

జనసేన అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం..ఈ సారి పవన్ ఒక్క సీటులోనే పోటీ చేస్తారని..అది కూడా ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో పవన్ ఉన్నారని..అందుకే భీమవరం బరిలో దిగడానికే పవన్ రెడీగా ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి పవన్ ఈ సారి ఏ సీటులో పోటీ చేస్తారో.