టాలీవుడ్ స్టార్ అల్లుఅర్జున్ ఇటీవల తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం మద్దతుగా నంద్యాలలో ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అలాగే మెగా హీరోలు అందరూ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా జనసేన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం జనసేన ప్రత్యార్థి అయిన శిల్పా రవి కి సపోర్ట్ చేయడంతో మెగా అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇకపోతే నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు గట్టిగా వినిపించాయి. మెగా వెర్సెస్ అల్లు అన్నట్లుగా ఫ్యాన్స్ మధ్య పోరు జరిగింది.
ఇలాంటి టైంలో చిరంజీవి, అల్లు అర్జున్ ఒకే వేదికపై కనిపిస్తున్నారంటూ సమాచారం. దాసరి నారాయణమూర్తి జయంతి వేడుకలు నేపథ్యంలో మే 4న డైరెక్టర్స్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది డైరెక్టర్స్ డే ని భారీగా నిర్వహించాలని డైరెక్టర్స్ టీం భావిస్తున్నారట. ఎన్నికల కోడ్ కారణంగా మే 4న పర్మిషన్ రాలేదు. దీంతో ఈవెంట్ ను మే 19న ఎల్బి స్టేడియంలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోస్ తో పాటు టాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ హాజరై సందడి చేయనున్నారు.
అయితే ఈ ఈవెంట్లో చిరు, బన్ని హైలెట్గా నిలవబోతున్నారని టాక్. నెటింట ప్రస్తుతం జోరుగా సాగుతున్న ఈ వార్ కు చిరు గాని బన్నీ గాని ఆ ఈవెంట్లో ముగింపు పలికే అవకాశం ఉంది. దీంతో ఇటు మెగా అభిమానులు, అటు అల్లు అభిమానులు కూడా ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొందరు మాత్రం వాళ్లలో వాళ్లు ఎన్ని గొడవలు పడిన.. చివరకు వాళ్లంతా ఒకటే అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.