రెబల్ స్టార్ కృష్ణంరాజు దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆయన ఇటీవల కన్నుమూశారు.AIG హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా ఇవాళ ఉదయం 3:25 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు 83 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో ఆయన మరణించడం జరిగింది. 1940 సంవత్సరం జనవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన ఈయనకు ముగ్గురు కుమార్తెలు. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు ఈయన పూర్తిపేరు. ఇక కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. 1970 నుండి 1980 మధ్యకాలంలో 183 తెలుగు సినిమాలలో నటించిన ఈయన ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
భారతీయ జనతా పార్టీ తరఫున 12వ లోకసభ ఎన్నికలలో.. కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కృష్ణంరాజు, ఆ తర్వాత 13వ లోకసభ కి కూడా నర్సాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయి అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుండి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.. కృష్ణంరాజు తమ్ముడు ఉప్పలపాటి సత్యనారాయణ కుమారుడే ప్రభాస్.కృష్ణంరాజు 1996 నవంబర్ 21వ తేదీన శ్యామల దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి అనే ముగ్గురు కుమార్తెలు కూడా. కృష్ణంరాజు చనిపోవడంతో పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి పలువురు సెలబ్రిటీలు కూడా ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నట్లు సమాచారం. ఇకపోతే కృష్ణంరాజు మరణించడం ఆ ఇంటికి పెద్దదిక్కు లేకుండా పోవడం చాలా బాధాకరమని చెప్పవచ్చు.