డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల విచారణ ముగిసింది. శనివారం ఉదయం విచారణకు హాజరైన నవదీప్ ను నర్సింగరావు, సునీత్ రెడ్డి నేతృత్వంలో అధికారులు సుమారు 6 గంటల పాటు విచారించారు. డ్రగ్స్ కేసులో దేవరకొండ సురేఖ, రామచంద్ర తో పరిచయంపై ఆరా తీసినట్లు తెలుస్తుంది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్.. పాన్ ఇండియా లెవెల్ లో ఇన్వెస్టిగేషన్ చేశారని చెప్పాడు.
డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు అందడంతోనే విచారణకు వచ్చేసాను. డ్రగ్స్ కేసులో సిపి సివి ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీం బాగా పని చేస్తుందని.. ఏడేళ్లు క్రితం నాటి ఫోన్ కాల్స్ వివరాలపై కూడా ఆరా తీశారని తెలిపాడు. గతంలో ఒక పబ్ బిజినెస్ లో తన ప్రమేయం ఉండటం వల్ల గతంలోనూ సిట్, ఈడి తనను విచారించిందని తాజాగా మరోసారి అధికారుల వద్ద ఉన్న సమాచారం మేరకు తనను పిలిచి విచారించారని చెప్పాడు.
అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని.. అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారని చెప్పారు. కాగా.. ఇవాళ్టి విచారణలో కాల్ లిస్ట్ ముందుంచి నవదీప్ ను విచారించానట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో వాట్సాప్ చాటింగ్ రిట్రీవ్ చేసి ఆ డేట్ ప్రకారం మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, వ్యాపారాలు, బిజినెస్ వివరాలపై ఆరా తీయగా కొన్ని ప్రశ్నలకు నవదీప్ సమాధానాలు దాటివేసినట్లు తెలుస్తుంది.