నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.
డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్.. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏపీలో వైజాగ్ వేదికగా ఈ నెల 27వ తేదీన గానీ .. 28వ తేదీన గానీ అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్లు వేశారు. ఇందులో భాగంగానే శ్రేయాస్ మీడియా వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కానీ, ప్రస్తుతం వైజాగ్లో భారీ వర్షాల కారణంగా జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గినప్పటికీ .. ఆ ప్రభావం నుంచి వాళ్లు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే అఖండ మేకర్స్ మనసు మార్చుకుని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులోనే శిల్పకళావేదికలో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక త్వరలోనే దీనిపై స్పష్టత కూడా రానుంది. అయితే `అఖండ` ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో చిత్ర టీమ్ వేసుకున్న ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయ్యాయని ప్రచారం జరగడంతో.. బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.