వెన‌క్కి త‌గ్గిన దిల్ రాజు.. సంక్రాంతి రేసు నుంచి `వార‌సుడు` ఔట్‌?!

ఈ సంక్రాంతి బరిలో దిగ‌బోతున్న చిత్రాల్లో `వార‌సుడు(త‌మిళంలో వ‌రిసు)` ఒక‌టి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్ లో రూపుతద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. శరత్ కుమార్, సుమన్, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్యామ్, జయసుధ, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి త‌రుణంలో ఓ షాకింగ్ వార్త తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంటుంద‌ట‌. రెండు భాష‌ల్లో ఒకే రోజు ఈ సినిమా రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఇటీవ‌లే వారిసు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

కానీ తెలుగు వెర్ష‌న్ రిలీజ్‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే తెలుగు వెర్ష‌న్ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకున్న‌ట్లు బ‌లంగా టాక్ వినిపిస్తోంది. ఈ పండుగ‌కు చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌, బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమాలు విడుద‌ల కానున్నాయి. వీటితో పాటు అజిత్ తెగింపు, సంతోష్ శోభ‌న్ క‌ళ్యాణం క‌మ‌నీయం సినిమాలు కూడా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. ఇన్ని చిత్రాలతో పోటీ క‌లెక్ష‌న్స్ పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని భావించే దిల్ రాజు వెన‌క్కి త‌గ్గుతున్నాడ‌ట‌. కేవ‌లం త‌మిళ వెర్ష‌న్‌ను మాత్ర‌మే జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేసి.. తెలుగుతో సంక్రాంతి త‌ర్వాత విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని కూడా అంటున్నారు.