‘ఉప్పెన’ దర్శకుడితో సినిమా పట్టాలెక్కించనున్న తారక్…?

హిట్టు, ఫట్టు అనే ఫలితాలతో సంబంధం లేకుండా జూనియర్ ఎన్టీఆర్‌కు ఓ అలవాటు ఉంది. కనీసం తన అభిమానుల కోసమైనా ఏడాదికో సినిమా చేసేవాడు. అయితే గత నాలుగేళ్ల కాలంలో కేవలం ఒక్కటంటే ఒక్కటే సినిమా విడుదలైంది. ‘అరవింద సమేత’ తర్వాత తన సమయం మొత్తం ‘ఆర్ఆర్ఆర్’కే కేటాయించాడు. రాజమౌళి దర్శకుడు కావడంతో ఆ సమయం కేటాయించక తప్పలేదు. పైగా ఓ రెండేళ్ల కాలం కరోనా వల్ల పోయింది. షూటింగ్స్‌ కూడా అంతగా జరగలేదు. బయటకు రావడానికే భయపడేవారు. ఇలా తన సినిమాలకు ఎన్టీఆర్ గ్యాప్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత ఆ సినిమా భారీ హిట్ అయింది. అయితే ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ ఏదో ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ నటించే సినిమాపై ఓ క్లారిటీ వచ్చినట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత తారక్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. తన తదుపరి ప్రాజెక్టులన్నీ భారీ చిత్రాలుగానే ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. అయితే షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. చిరంజీవితో కొరటాల తీసిన ‘ఆచార్య’ సినిమా డిజాస్టర్‌గా మారింది. ఈ నేపథ్యంలో కొరటాల చెప్పిన లైన్, కథను మరికొంత కొత్తగా తీర్చిదిద్దాలని తారక్ సూచించినట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ మరో భారీ ప్రాజెక్టుకు కూడా ఓకే చెప్పాడు. ప్రశాంత్‌నీల్‌తో ఆయన సినిమా చేయనున్నాడు. అయితే ప్రభాస్ హీరోగా వస్తున్న ‘సలార్’ సినిమా షూటింగ్‌లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడు. కాబట్టి స్టోరీకి మార్పులు చేసి రావాలని కొరటాలకు తారక్ చెప్పినట్లు సమాచారం. ఈ లోపు ‘ఉప్పెన’ సినిమా చేసిన దర్శకుడు బుచ్చిబాబు ఓ స్టోరీని తారక్‌కు గతంలో వినిపించాడు. దీనికి తారక్ కూడా ఓకే చెప్పాడు.


అయితే కొరటాల, ప్రశాంత్‌నీల్ సినిమాలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని భావించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్ కథతో రానున్న బుచ్చిబాబు సినిమాను ఎన్టీఆర్ పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో బుచ్చిబాబును సినిమా పట్టాలెక్కించాలని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే కొన్ని రోజుల్లోనే బుచ్చిబాబు-తారక్ కాంబినేషన్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.