పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది నిజంగానే బాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే ఓ వ్యక్తి మృతి చెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని బతకాలని పవన్ కళ్యాణ్ వైద్యసాయం అందించినప్పటికీ అతడు మృతి చెందాడు. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం లింగాల చెందిన భార్గవ్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అతడికి క్యాన్సర్ సోకడంతో కొన్ని నెలలుగా అతడు చికిత్సలు చేయించుకుంటున్నాడు.

కాగా తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని, ఆయనను చూడాలని ఉందని, ఇదే తన ఆఖరి కోరికని భార్గవ్ తెలిపాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న జనసేన కార్యకర్తలు దీనిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాది మార్చిలో పవన్ కళ్యాణ్ స్వయంగా భార్గవ్ ఇంటికి వచ్చాడు. అభిమానిని స్వయంగా పలకరించి ఆప్యాయంగా అతడితో గడిపాడు. భార్గవ్ వైద్య చికిత్స కోసం రూ. 5 లక్షల సహాయం అందించాడు.

అనంతరం అతడికి అందించిన వైద్యంతో భార్గవ్ కోలుకున్నాడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఇటీవలి కాలంలో మళ్లీ అనారోగ్యానికి గురైన భార్గవ్ ఈసారి క్యాన్సర్ ను జయించలేక ప్రాణాలు విడిచాడు. పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే వ్యక్తి చనిపోయాడని తెలుసుకున్న ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అతడికి సంతాపం తెలుపుతున్నారు.